మహిళలకు మరో బంపర్ ఆఫర్.. 221ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్లలో విజయ డెయిరీ పార్లర్లు!
తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం, మహిళల ఆర్ధిక స్వావలంబన కోసం ఎంతో కృషి చేస్తున్న విషయం తెలిసిందే. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణా ప్రభుత్వం ఆ దిశగా ఇందిర మహిళా శక్తి కాంటీన్ లు మొదలుకొని అనేక వ్యాపార అవకాశాలు కల్పించింది. మహిళలకు డ్రోన్లు, రైస్ మిల్లులు, బస్సులు, సూపర్ బజార్ లు ఇలా అనేక అవకాశాలను కల్పించింది.
తాజాగా మళ్ళీ మహిళా స్వయం సహాయక సంఘాల ఆదాయం పెంచే దిశగా మరో కీలక చర్యకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 221 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లలో విజయ డెయిరీ పార్లర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ చర్య వల్ల మహిళా సంఘాలకు అదనపు ఆదాయం లభించనుంది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఇప్పటికే అనేక క్యాంటీన్లు మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.

వీటిలో విజయ డెయిరీ ఉత్పత్తులు పాలు, పెరుగు, నెయ్యి, ఇతర పాడి పదార్థాలు అమ్మకానికి అవకాశం కల్పించడం ద్వారా సంఘాల ఆదాయం మరింత పెరుగుతుంది. క్యాంటీన్లు ఎక్కువగా కలెక్టరేట్లు, ఆసుపత్రులు, బస్ స్టాండ్లు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉండటం వల్ల అమ్మకాలు బాగా జరగనున్నాయి. ఈ పార్లర్ల నిర్వహణ పూర్తిగా మహిళా సంఘాల చేతుల్లోనే ఉంటుంది.
దీనివల్ల మహిళలకు స్వయం ఉపాధి, వ్యాపార నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. విజయ డెయిరీ ఉత్పత్తులకు మార్కెట్ విస్తరించడంతో పాడి రైతులకు కూడా లాభం చేకూరనుంది.
ప్రభుత్వం ఇంతకు ముందు కూడా మహిళా సంఘాలకు అడుగడుగునా అండదండలు అందిస్తూ ఏ చిన్న అవకాశం ఉన్నా సరే మహిళా లోకానికి ఆ అవకాశం కల్పిస్తుంది.
ఇప్పుడు డెయిరీ పార్లర్లు కూడా ఏర్పాటు చేయటం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబనకు మరింత బలం చేకూరుతుంది. ఈ నిర్ణయం మహిళా సాధికారతకు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి సృష్టికి దోహదపడుతుందని మహిళా సంఘాల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.













Click it and Unblock the Notifications
