లావుగా ఉంది.. చరణ్ కు తగిన జోడీ కాదన్నారు: ట్రోల్స్ పై ఉపాసన షాకింగ్ రియాక్షన్..!
సెలబ్రిటీలు అన్నాక బాడీ షేమింగ్, రూమర్స్, ట్రోలింగ్ లాంటివి సామాజిక మాధ్యమాల్లో కామన్ అయిపోయాయి. సెలబ్రిటీల రూపం, ఎత్తు, బరువు ఇలా పలు అంశాలపై విమర్శలు చేయడం నెట్టింట కొందరికి అలవాటుగా మారిపోయింది. అయితే ప్రముఖ వ్యాపారవేత్త, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమె కూడా గతంలో ట్రోలింగ్ ను ఎదుర్కొన్నట్లు తెలిపారు. తనపైనా బాడీ షేమింగ్ చేశారని అందుకు సంబంధించిన విషయాలను ఇటీవల పంచుకున్నారు.
2012 లో రామ్ చరణ్- ఉపాసన వివాహం జరిగింది. అయితే మ్యారేజ్ సమయంలో తాను లావుగా ఉన్నానని.. చరణ్ కు తగిన జోడీ కాదని కొందరు బహిరంగంగానే తనపై విమర్శలకు దిగడం జరిగిందని అన్నారు. ఇలాంటి మాటలు విన్నప్పుడు తాను మానసిక క్షోభను అనుభవించానని తెలిపారు. బయటి వ్యక్తుల మాటల కంటే తన కుటుంబ సభ్యుల ఆలోచనలకే గౌరవం ఇచ్చానని చెప్పుకొచ్చారు. అయితే తాను అంతలా బరువు పెరగడానికి గల కారణాలను కూడా వివరించారు ఉపాసన. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లినప్పుడు ఫ్యామిలీను వదిలి హోమ్ సిక్ ఫీల్ అయ్యానని.. అలా మానసిక ఒత్తిడి నుంచి బయట పడేందుకు తనకు తెలియకుండానే ఎక్కువగా తినేదాన్ని అని అలా 18 ఏళ్లకే 95 కిలోల బరువు పెరిగినట్లు తెలిపారు.

ఆ తర్వాత లైఫ్ స్టైల్ మార్పులతో బరువు తగ్గానని అన్నారు. రైస్, గోధుమ పదార్థాలను తగ్గించి ఓట్స్, హై ప్రొటీన్ ఆహారాన్ని ఎంచుకున్నానని.. అలాగే రోజూ కాలేజీకి నడుచుకుంటూనే వెళ్లేదాన్ని అని రోజూ క్రమం తప్పకుండా 10 వేల అడుగులు వేస్తూ ఉండేదాన్ని అని గుర్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఉపాసన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక రామ్ చరణ్- ఉపాసన దాంపత్యం అన్యోన్యంగా సాగుతోంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మొదటి కుమార్తెతోపాటు 2026 లో వీరికి కవల పిల్లలు జన్మించారు. పెద్ద కుమార్తె పేరు క్లింకార కాగా, కుమారుడి పేరు శివరామ్ కొణిదెల, అలాగే చిన్న కుమార్తె పేరు అన్విరా కొణిదెలగా నామకరణం చేశారు. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల పెద్ది సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సుకుమార్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు రామ్ చరణ్.












Click it and Unblock the Notifications
