Fact Check:కోవిడ్ వ్యాక్సిన్ కోసం సీనియర్ సిటిజెన్లు ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా..?
న్యూఢిల్లీ: జనవరి 13 నుంచి దేశవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో పలు అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇవే అనుమానాలు సోషల్ మీడియా వేదికగా ప్రచారంలోకి వస్తున్నాయి. తాజాగా డ్రగ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఫోన్ చేస్తున్నట్లుగా సీనియర్ సిటిజెన్స్ కు ఫోన్లు వెళుతున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ ముందుగా మీకు ఇస్తున్నామంటూ చెబుతూ సీనియర్ సిటిజెన్స్ నుంచి ఆధార్ నెంబర్, బ్యాంక్ ఖాతాలు, ఓటీపీలను మోసగాళ్లు అడుగుతున్నారు. అయితే ఇంకా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రొటోకాల్ లేదా గైడ్లైన్స్ విడుదల చేయలేదు ప్రభుత్వం. ఇవి తెలియని సీనియర్ సిటిజెన్స్ కోవిడ్ వ్యాక్సిన్కు సంబంధిచిన ఫోన్ రావటంతో వారి వ్యక్తిగత వివరాలన్నీ అవతల మోసగాళ్లకు ఇచ్చేస్తున్నారు. ఇలా ఇచ్చి దాదాపు రూ.12 లక్షల దాకా మోసగాళ్లు కొల్లగొట్టారు. వారి ఇబ్బందులను వారి బంధువులు సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు. అంతా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
ఇలాంటి స్కామ్ ఒకటి ఉత్తర్ ప్రదేశ్లో వెలుగు చూసింది. కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఆరోగ్యశాఖ నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా ఎలాంటి ఫోన్లు చేయడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫ్రంట్ లైన్ వారియర్స్కు మాత్రం వ్యాక్సినేషన్ జనవరి మూడవ వారంలో ఇవ్వడం జరుగుతుందని దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేదని సీఎంఓ కార్యాలయం స్పష్టమైన ప్రకటన చేసింది.
రిజిస్ట్రేషన్ పేరుతో వస్తున్న ఫోన్కాల్స్ ఫేక్ ఫోన్ కాల్స్ అని ఎవరూ తమ వివరాలను ఇవ్వొద్దని హెచ్చరిస్తోంది యూపీ సర్కార్. ఎక్కడా కోవిడ్ వ్యాక్సిన్కు రిజిస్ట్రేషన్ జరగడం లేదని వివరించింది. ఇలాంటి మోసం వెలుగు చూడటంతో దయచేసి మోసపోవద్దని, ఇలాంటి మోసగాళ్ల చేతిలో డబ్బులు పోగొట్టుకుని మోసపోవద్దంటూ ఏడీజీ దవా షేర్పా తెలిపారు. ఇప్పటి వరకు ఏ కంపెనీ లేదా ప్రభుత్వం వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నట్లు చెప్పలేదని వెల్లడించారు. ఒక్కసారి ప్రక్రియ ప్రారంభం కాగానే ప్రజలకు ప్రభుత్వం ముందస్తు సమాచారం ఇస్తుందని షేర్పా తెలిపారు.
Fact Check
వాదన
కోవిడ్-19 వ్యాక్సిన్ సిద్దంగా ఉందంటూ డ్రగ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి సీనియర్ సిటిజెన్లకు ఫోన్లు
వాస్తవం
అధికారులు ఇలాంటి ఫోన్లు చేయడం లేదు. ఇదొక స్కామ్ అని తేల్చిన యూపీ ప్రభుత్వం