Fact check : జులై 1 నుంచి మళ్లీ లాక్డౌన్... ఆ ప్రచారంలో నిజం లేదు...
దేశంలో మరోసారి లాక్డౌన్ విధించినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్టు చక్కర్లు కొడుతోంది. థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా జులై 1 నుంచి జులై 31 వరకు లాక్డౌన్ విధించినట్లు అందులో పేర్కొన్నారు. అంతేకాదు,దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. దీంతో సామాన్య జనంలో గందరగోళం మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పష్టతనిచ్చింది.
ప్రధాని మోదీ ఇప్పటివరకూ అలాంటి ప్రకటన ఏదీ చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది. అసలు లాక్డౌన్ విధించాలన్న నిర్ణయమే తీసుకోలేదని తెలిపింది. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ మేసేజ్లను నమ్మవద్దని సూచించింది.
లాక్డౌన్ పేరుతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టులో ఐఐటీ కాన్పూర్ మోడల్ను ఉదహరిస్తున్నారు. సెకండ్ వేవ్ సమయంలో వారి అంచనా నిజమైందని... ఇప్పుడు థర్డ్ వేవ్ విషయంలోనూ వారి అంచనా నిజమవుతుందని అందులో పేర్కొన్నారు. ఆ అంచనా ప్రకారం జులై 15 నుంచి థర్డ్ వేవ్ మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
అయితే ఈ అంచనా నిజమని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవు. పైగా ఆ పరిశోదన చేసిన బృందం సమగ్ర వివరాలను పరిగణలోకి తీసుకోలేదు. కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులను చూసి అనవసరంగా ఆందోళన చెందవద్దు. ఫేక్ మెసేజ్లను ఇతరులకు ఫార్వార్డ్ చేయవద్దు.
థర్డ్ వేవ్పై ఇప్పటివరకూ ఊహాగానాలే తప్ప సరైన ఆధారాలేవీ లేవు. అయినప్పటికీ ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాలి. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు ముఖానికి మాస్కు ధరించడం,భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. తద్వారా మరో వేవ్ రాకుండా కట్టడి చేయడానికి ఆస్కారం ఉంటుంది.
Fact Check
వాదన
కరోనా మూడో వేవ్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు.
వాస్తవం
లాక్డౌన్పై ప్రధాని మోదీ ఎటువంటి ప్రకటన చేయలేదు. అసలు కేంద్రం దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.