దిగంబర కవిగా నగ్నముని ప్రసిద్ధులు. ఆయన రాసిన కొయ్యగుర్రం దీర్ఘకావ్యం అనేక చర్చలు దారి తీసింది. నగ్నమునిది పదును దేరిన కలం. సమాజంలోని వికృతాలపై ఆయన కలం నిప్పులు కక్కుతుంది.

మన రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం గారు తరుచుగా కలలు కనండి. వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడి పని చేయండి అని అంటూ వుంటారు. నిస్సందేహంగా ఇది చాలా చక్కని సందేశం. అయితే, దీనిపై నా మిత్రుడొకాయన యిలా అన్నాడు. రాష్ట్రపతి గారు చెప్పింది బావుంది. ఉత్తేజకరంగా వుంది. కాని, ఆ విషయమే మరింత స్పష్టంగా వుండాలంటే... యిలా వుండాలి. అదేమంటే - కలలు కనండి.... వాటిని సాకారం చేసుకునేందుకు అమెరికా వెళ్లి కష్టపడి పనిచేయండి. అని వుండాలి అన్నాడు.ది కూడా బాగానే వున్నట్లుంది. ఎందుకంటే మన యువత సాధించిన ఎన్నో విజయాలు అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుతూనో, సంస్థల్లో పరిశోధిస్తూనో సాధించినవే. ఉపాధికీ, పై చదువులకీ, పరిశోధనలకీ - అన్ని రంగాల నుండి మన యువత విదేశాలకు పెద్ద ఎత్తున వెళిపోతున్నది. తద్వారా వారి సేవలు ప్రధానంగా, వెనువెంటనే విదేశాలకే అందుతున్నాయి. మన దేశానికి అందుతున్నది బహు తక్కువ గదా అని మన రాజకీయ నాయకులు బాధపడడం లేదు. వలసలను ఆపడానికి తగు ప్రోత్సహకాలు అందజేయడం లేదు. వలస వెళ్లవలసిన అవసరం లేని పరిస్థితులు యిక్కడ కన్పించడం లేదు. పైగా, తమ సంతతిని విదేశాలకు పంపడంలో పోటీ పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల వల్లే మనం సాధించిన స్వాతంత్య్రానికీ, దేశీయతకీ, మాతృభూమి భావనకీ ప్రాముఖ్యం లేకుండా పోయింది. అబ్దుల్‌ కలాంగారు మనం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్త. ఆయన జీవితం గొప్పది. సాధించిన విజయాలు గొప్పవి. అందులో సందేహం లేదు. అయితే ఆయన యింకేమీ కాకుండా శాస్త్రవేత్తగానే వుంటూ యిటువంటి సందేశాలు యిచ్చివుంటే, అవి మన జాతికి ఎంతగా ప్రయోజనకరమైనవి అయినా, వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. మీడియా ప్రముఖంగా ప్రచురించి వుండేది కాదు, వినిపించేది కాదు. ఆయన రాష్ట్రపతి అయినందువల్ల, ప్రథమ పౌరుడు కావడం వల్ల, రాజకీయ రంగం నుండి మాట్లాడుతుండడం వల్ల వారి మాటలకు అంత ప్రాముఖ్యత ఏర్పడింది. ఆయన చెప్పే మాటలు ఆచరణలోకి రావాలంటే సందేశాలు యివ్వడంతో ఆగిపోకూడదు. కలలు కనండి అన్నారు. కలలు కనడానికి యువత సిద్ధంగా వుంది. కష్టపడి పని చేయండి అన్నారు. కష్టపడి పనిచెయ్యడానికి కూడా యువత సంసిద్ధంగా వుంది. కాని, యా రెండింటికీ తగిన అవకాశాలు మన దేశంలో లేవు. అందుకని, కలలు కనమని, కష్టపడి పనిచెయ్యమని ఒక వైపున యువతకు చెబుతూనే, మరో వైపున ఆ దిశగా యువతకు తగు అవకాశాలు కల్పించమని మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అంకుశంతో పొడవవలసి వుంటుంది. అప్పుడే వారి మాటలకు న్యాయం చేకూరుతుంది. లేకపోతే, పాఠ్యపుస్తకాల్లోనో, గోడలమీదనో రాసుకునే సూక్తులుగానో, అర్థవాక్యాలుగానో మిగిలిపోతాయి. ఇదొక్కటే కాదు. మరికొన్ని తాజా వుదాహరణలు కూడా ఉదహరించవచ్చు. ఒకప్పుడు స్వాతంత్య్ర దినం గానీ, గణతంత్ర దినం గానీ వచ్చినప్పుడు కులాలకీ, మతాలకీ అతీతంగా జాతి జాతంతా ఉద్వేగభరితమయ్యేది. అతి గొప్ప జాతీయ పండుగగా చేసుకునేది. దేశమంతా ఆనందోత్సాహాలతో రెపరెపలాడేది. సంతోషం ప్రవహించేది. క్రమంగా అదంతా ఆవిరైపోయింది. రక్తం నీరుగా మారిపోయింది. కొన్నాళ్లు అది ప్రజలతో సంబంధం లేని రాజకీయుల పండుగగా కొనసాగింది. ఆ దశ కూడా దాటి, యివాళ అది సర్కారువారి, స్కూలు పిల్లల తప్పనిసరి బలవంతపు వ్యవహారంగా అయిపోయింది. ఆగస్టు 15, జనవరి 26 రాగానే రాష్ట్రపతి, గవర్నర్లు, ముఖ్యమంత్రులు ప్రజలకు సందేశాలిస్తారు. పత్రికలు బొమ్మల్తో ప్రముఖంగా ప్రకటిస్తాయి. ప్రజలు చదువుకుని పక్కన పడేస్తారు. టి.వి.లో పక్కన గల చానెల్‌కు తిప్పేస్తారు. ఈ మొత్తం వ్యవహారమంతా తమకు సంబంధం లేని, మరేదో దేశంలో జరుగుతున్నట్లు చూస్తారు నాయకులతో సహా. ఎందుకిలా జరుగుతోంది? ఈ సందేశాల ప్రభావం ప్రజలపై ఎందుకు వుండడం లేదు? దీనిపై ప్రభుత్వంలో విశ్లేషణ జరగడం లేదు. అది కూడా ఒక విచిత్రం. ఇలా ఎందుకు జరుగుతున్నదంటే - మన దేశంలో జరుగుతున్న సంఘటనలకు, పరిస్థితులకు, సందేశాల్లోని విషయాలకూ పొంతన లేకపోవడం వల్ల, నిర్దేశించే లక్ష్యాలకు, ఆదర్శాలకు, ఆచరణ సాధ్యాసాధ్యాలకు మధ్య ఆమడ దూరం వుండడం వల్ల యిలా జరుగుతోంది. మొన్నటి జనవరి 26 సందేశాలు చూద్దాం. రాష్ట్రపతి మాటల్లోని విషయాలు, ఆచరణలో అవి ఎంతవరకు సాధ్యం అనేది చూద్దాం. ఎన్నికలైన వెంటనే రాజకీయ పార్టీలు అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ఎంపిలు యా దేశ యువతకు ఆదర్శంగా నిలవాలి. కడపటి వ్యక్తిని గుర్తించి సేవలందించాలి. నిజమైన ఆర్తులకు అండదండగా ఉండాలి - యిటువంటివే మరికొన్ని సూక్తులు చెప్పారు. చాలా బావున్నాయి. వినడానికి బావుంటాయి. ఇటువంటివి చెప్పేవారికి కూడా బోలెడు కీర్తి వస్తుంది. కాని, వాస్తవం వేరుగా వుందే. మన దేశంలో ఎన్నికలు చాలా ఖర్చుతో కూడిన తతంగం. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టిన పార్టీలు, అభ్యర్థులు సహజంగానే దీనిని తిరిగి రాబట్టుకోవాలనీ, అలాగే నాలుగైదు రెట్లు సంపాదించాలనీ, తర్వాత తర్వాతి ఎన్నికలకు వీలవుతుందనీ యోచిస్తారు. కాని, కోట్లకు కోట్లు ఖర్చు చేసి, దాన్ని పోగొట్టుకుని, ఎన్నికలై పోగానే ప్రజాసేవ చెయ్యమని, యువతను ఆదర్శంగా నిలవమనీ అంటే దానిని హాస్యంగా తీసుకుంటారే తప్ప సీరియస్‌గా తీసుకోరు. ఎన్నికల ఖర్చు విపరీతంగా పెరిగిపోవడం వల్ల వ్యాపారంగా మారిపోయింది. అందుకని, తమ సందేశం ఆచరణ సాధ్యం కావాలంటే ముందుగా, వెనువెంటనే, ఎన్నికల ఖర్చు అతి తక్కువ అయ్యేందుకు మార్గాలు వెతకాలి. అలా వెతకమని ప్రభుత్వాలకూ, సామాజిక శాస్త్రవేత్తలకూ, మేధావులకూ చెప్పాలి. పరిశోధనలు చెయ్యాలి. ఎన్నికల ఖర్చు తగ్గినప్పుడే నిపుణులు ఎన్నకల్లో నిలవడానికి, వారి సేవలు దేశానికి అందడానికి వీలవుతుంది. అప్పుడే దేశ రాజకీయాలు మారడానికి అవకాశం కలుగుతుంది. వాస్తవ నేత్రాలతో కలలు కనాలి. ఇవాళ చాలామంది చాలా చాల కలలు కంటున్నారు. అందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కానీ, కలల్లో తేడాలున్నాయి. సామాన్యుని కల మాత్రం ఆ రోజు ఎలా గడవాలా అనే. సామాన్యుని కల పట్టించుకునేవాడే నిజమైన అసామాన్యుడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+