హైదరాబాద్ పేలుళ్లు: బిజెపి తీరే వేరు

Sajee Gopal on terrorism, BJP stand
భిన్న సంస్కృతులతో విలసిల్లిన హైదరాబాద్ నగరం, ఇప్పుడు బాంబు దాడులతో దద్దరిల్లు తుంది. వందలాది సంత్సరాలు కలిసి బతికిన జనం, ఇప్పుడు భయం తో, అభద్రతా భావం తో తల్లడిల్లుతున్నారు. ఉగ్రవాద చర్యలకు అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. రక్తసికమైన వీధుల్లో ఆర్తనాదాలు మారు మోగుతున్నాయి, బిడ్డలు కోల్పోయిన తల్లులు, తండ్రులు కోల్పోయిన పిల్లలు, పొద్దు కూకినా ఇంటికి తిరిగిరాని అన్నలు. జనం మనస్సులలో కమ్ముకున్న భయపు మేఘాలు, విషాదం లో మునిగిన లక్షలాది జనం, దుఖ సాగరం లో దిల్ సుఖ్ నగర్, చలించిపోయిన చార్మినార్, కన్నీళ్ళు పెట్టుకున్న హుస్సేన్ సాగర్ మధ్యలో మూగవోయిన గౌతమ బుద్ధుడు, తల్లడిల్లిన హైదరాబాద్ షహర్.

చనిపోయిన తర్వాత రాజకీయనాయకులు సంతాపం ప్రకటిస్తారు, మొసలి కన్నీళ్ళు కారుస్తారు, పోలీసులు పోస్టుమార్టం చేస్తారు, టెలివిజన్ చానెళ్ళు నాలుగు రోజులు ప్రసారాలు చేస్తాయి, వారం రోజులు తర్వాత అందరు అంతా మర్చిపోతారు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంటూంది. పోయిన ప్రాణాలు తిరిగి రావుకదా! ఉగ్రవాదం ఏ మతానిది అయినా, అది అమాయకులనే బలి తీసుకుంటుంది. దిల్ సుఖ్ నగర్, మక్కామసీద్, గోకుల్ ఛాట్ లలో అన్ని మతాల వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. రాములు, మహ్మద్ రఫీ, విజయ్ కుమార్, ఎజాజ్అహ్మాద్. స్వప్నా,ఉస్మానియా అజీజ్ లు హింసకు బలి అయ్యిపోయారు.

నేటి సమాజం ఒక హింసా విష వలయంలో చిక్కుకు పోయింది. హింస-ప్రతి హింస, హత్యలు-ప్రతీకార హత్యలు-ఉరిశిక్షలు, పోలీసు ఎన్ కౌంటర్ హత్యలు, మతోన్మాదం, మొద్దు బారిపోతున్న మెదళ్ళు, మానవ స్పందన లేని హృదయాలు, దిగజారి పోతున్న మానవ విలువలతో భ్రష్టుపట్టిపోతున్న సమాజం. పౌర సమాజానికి శాంతి భద్రతలు కల్పించటంలో, కాంగ్రెసు రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థ విఫలమైనాయి. మానవ హక్కుల నేపధ్యంలో, అమాయకుల ప్రాణాలు తీయటాన్ని తీవ్రంగా ఖండించాలి, మత ఉగ్రవాదాన్ని సమూలంగా ఓడించాలి. రాజకీయ లక్ష్యాల కోసం, న్యాయమైన డిమాండ్ల కోసం , అమాయకులను గుడ్డిగా చంపటం భావ్యం కాదు. పోలీసులు అమాయకులను వేధించ కుండా, ప్రతీకార ఎన్ కౌంటర్ హత్యలకు పాల్పడకుండా, పత్రికలలో కట్టుకథలు ప్రచారం చేయకుండా, మారణహోమానికి కారణమైన హంతకులు, కుట్రదారులను పట్టుకొని చట్ట ప్రకారం విచారించాలి, న్యాయస్థానం సాక్ష్యాల ఆధారంగా శిక్షించాలి.

పోలీసులు, ఇంటలిజెన్స్ వర్గాలు ఇరవై నాలుగు గంటలు పౌర సమాజానికి భద్రత కల్పించటం సాధ్యమౌతుందా? ప్రతీ ఉగ్రవాద చర్యనూ పోలీసులు నివారించటం సాధ్యమా? ఎన్ని కోట్ళు ఖర్చుపెట్టినా, ఎంత సాంకేతిక పరిజ్నానం ఉపయోగించినా, పోలీసువర్గాలు సంఖ్య ఎంత పెచ్చినా, సమాజంలో పూర్తిగా శాంతి నెలకొల్పటం ఒక సవాళ్ళే . మంత్రులు, రాజకీయనాయకులకు నిత్యం కాపలా కాసే పోలీసులకు , సామాన్యుల గతి పట్టదు, బాధ్యతా వుండదు. గద్దె మీద కూర్చున్న మంత్రులకు, అఫల్ గురు ను ఉరితీస్తే హింస జరుగుతుందని తెలుసు, అమాయకులు ప్రాణాలు కోల్పోతారని తెలుసు. యావజీవ కారాగార శిక్ష వేస్తే, పెద్దగా జరిగే నష్టం ఏమీ వుండదు. కానీ వారి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉరితీయాలి, ప్రతీకారం తీర్చుకోవాలి. ఉరి తర్వాత జరిగే పరిణామాలు ఎంత తీవ్రంగా వున్నా, ప్రాణం నష్టం జరిగినా ప్రభుత్వం పెద్దగా పట్టించు కోదు.

వాస్తవానికి ఉగ్రవాదాన్ని నిజంగా నివారించాలనే తపన మనకు వుంటే, ఉగ్రవాదం వెనక వున్న రాజకీయ కారణాలు విశ్లేషించాలి? రాజకీయ పరిష్కరాలు ఏమిటని ఆలోచించాలి. ప్రభుత్వ పాలక విధానాలు ఉగ్రవాదాన్ని ఎలా ప్రేరేపిస్తున్నాయి? భారత దేశంలో రాజకీయ, పోలీసు, న్యాయ వ్యవస్థలు ముస్లిం లకు న్యాయం చేయగలుగుతాయా? గుజరాత్, ఢిల్లీ , కాశ్మీర్ లలో మారణకాండలకు పాల్పడిన హంతకులు శిక్షింప బడతారా? భాదితులకు న్యాయం జరుగుతుందా ? అనే ప్రశ్నలు ఉదయిస్తాయి. చాలా మంది ముస్లింలకు వ్యవస్థ పట్ల నెలకొన్న అసంతృప్తిని,అపనమ్మకాన్ని తొలగించటం ఎలా? మైనార్టీ, దళిత వర్గాలకు రాజకీయ, న్యాయ వ్యవస్థలలో విశ్వాసం కలిగించటానికి పరిష్కారాలు ఆలోచించాలి. సామాజిక న్యాయం, అభివృద్ది ఫలాలు అందరికి అందించటం, హంతకులను శిక్షించి న్యాయం అందించటం, మానవహక్కులు ప్రజాస్వామిక విలువలు ఆచరించాలి. క్యాన్సర్ పట్టిన యీ వ్యవస్థ లో ఇవ్వన్నీ సాధ్యం అవుతాయనే అపోహల నుండి బయట పడాలి. ఎన్ .డి.టీ.వీ ప్రణవ్ రాయ్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ‘పార్లమెంటు లో ఎంత మందికి నమ్మకం వున్నదని' అడిగితే, వందల మంది విద్యార్ధులలో ఒక్కరు కూడా చెయ్యి ఎత్తలేదు. సామాన్య జనం ‘పార్లమెంటు ప్రజాస్వామ్యం' పైన నమ్మకం కోల్పోతున్నారు.

ఒక వైపు జరిగిన దారుణానికి జనం విషాదంలో మునిగి వుంటే, మరొక వైపు ఆ విషాదాన్ని రాజకీయ ప్రయోజనాలకు వుపయోగించుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. బిజేపీ నాయకుడు కిషన్ రెడ్డి సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి, మానవహక్కుల నాయకులను నిందిస్తారు. వెంకయ్యనాయుడు ‘విచారణ జరగకుండానే లష్కరే తోయిబా' కారణం అంటారు . మరొక వ్యక్తి ‘పాతబస్తీలో ప్రతి ఇల్లు సోదా చేయాలి', ‘బంగ్లా దేశ్,పాకిస్థాన్ నుండి వలస వచ్చిన వాళ్ళే కారణం' అంటాడు. జనాన్ని రెచ్చ గెట్టే మాటలు, మూర్ఖపు వాదనలు కట్టిపెట్టి సంయవనం వహిస్తే మంచిది. విషాదాన్ని రాజకీయం చేయటం సమంజసం కాదు.

అన్ని మతాలలోని మత్మోనాదాన్ని ఓడించాలి. హైదరాబాద్ దుర్ఘటన లో అమాయకుల ప్రాణాలు తీసిన నిందులను కఠినంగా శిక్షించాలి, గుజరాత్, ఢిల్లీ , కాశ్మీర్ లలో మారణకాండలకు పాల్పడిన హంతకులను శిక్షించి బాధితులకు న్యాయం చేయాలి. తమ విధుల నిర్వహణ విఫలమైన ముఖ్యమంత్రి, హోమ్ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. మత సామరస్యం, సంవయనం, సెక్యులర్ సమాజం విలువలతో, ఐక్యతతో ప్రజలు ఉగ్రవాదాన్ని ఓడించి, హైదరాబాద్ షహర్లలో మళ్ళీ శాంతిని నెలకొల్పాలి .

- సాజీ గోపాల్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+