ఎందుకు బహిష్కరిస్తున్నామంటే..

అధికారం కోసం, ఆధిపత్యం కోసం, తెలంగాణ సాహిత్య సాంస్కృతిక చైతన్యాన్ని తొక్కివేసేందుకు తెలుగుతల్లిని ప్రతిష్ఠించి తెలంగాణ భాషా సంస్కృతులను తొక్కేశారు. ట్యాంక్బండ్పై తెలుగుతేజోమూర్తుల విగ్రహాలను నెలకొల్పుతూ తెలంగాణ సాహిత్య సాంస్కృతిక ఆనవాళ్లను తొక్కేశారు. తెలుగు తేజం, తెలుగు పౌరుషం, తెలుగువాడి ఆత్మగౌరవం పేరున రాజకీయపార్టీని నెలకొల్పి అధికారం హస్తగతం చేసుకున్నారు. భాషా సంస్కృతులకున్న గొప్పతనం, అది తేగలిగిన మహత్తరమైన కదలికలను ఆధిపత్యవాదులు పసిగట్టి భాషను ఆయుధంగా మలుచుకుని తెలంగాణ గుండెపై కొట్టారు.
విజయనగర రాజులకు ఏమాత్రం తీసిపోని కాకతీయుల వైభవం ఆంధ్ర వలసవాదుల చేతిలో కళావిహీనం అయ్యింది. నన్నయకు లభించిన గౌరవం పాల్కురికి సోమన్నకు దక్కలేదు. అన్నమయ్యకు సాహిత్యంలో ఇస్తున్నంత ప్రాధాన్యం రామదాసుకు కల్పించడం లేదు. ఆంధ్రులది ఆధిపత్యభావజాలం. ఆహంభావ జనిత అజ్ఞానం. వలసవాదపు పెత్తనం నన్నయ, తిక్కన, నాచన, సోమన, శ్రీనాథలకు పద ప్రయోగ సూచికలు తయారయ్యాయి. పాల్కురికి, పోతనలకు సిద్ధం కాలేదు. పోతన్న ఎంత గొప్ప ప్రజాస్వామ్యవాది! శిష్యులకూ, మిత్రులకూ భాగవతంలో ఐదు,ఆరు,పదకొండు, పన్నెండు స్కందాలు రాసే అవకాశం ఇచ్చాడు. ఇటువంటి సన్నివేశం ప్రపంచ సాహిత్యంలో ఎక్కడా కానరాదు. ఆంగ్ల సాహిత్యంలోని మిల్టన్ మినహా పోతనతో సాటిరాదగిన కవిపుంగవుడు ప్రపంచ సాహిత్యంలో కన్పించడు. అది తెలంగాణ గడ్డమీద జన్మించిన ముద్దు బిడ్డలకు సొంతం. ఇక్కడి మట్టిలో ఏదో శక్తి ఉన్నది.
దాశరథికి ఒక చేతిలో పెన్ను, ఇంకొక చేతిలో గన్ను. ఒకరు నరాధములకు భాగవతం అంకితమివ్వరు. ఇంకొకరు నిజాం పిశాచపు బూజు దులుపుతారు. ఒక్క ఆస్థానకవి పదవి లాంటి లౌల్యంతోనే దాశరథి పనికిరాకుండా పోయాడు. మరి శ్రీశ్రీ సంగతేమిటి? ఇందిరమ్మను కీర్తిస్తూ ఎమ్జన్సీలో పాటరాసి జైలుశిక్ష తప్పించుకోలేదా? అయినా ఆయన మహాకవి. కడుపులో చల్ల కదలని వాళ్లు విప్లవవాదులు.
ఆంధ్రులు ఐరిని బైరి, బైరిని ఐరి చేయగల సమర్థులు. కందుకూరి వీరేశలింగం గారి ముందు మన భాగ్యడ్డి వర్మ మరుగుజ్జు అయిపోయాడు. కందుకూరి దక్షిణదేశపు ఈశ్వర చంద్ర విద్యాసాగరుడే. మా మేదరి బాగయ్య పేదల బాగుకోసం శ్రమించలేదా? తుర్రేబాజ్ఖాన్ స్వాతంత్య్ర సమరయోధుడు కాడా? షోయెబుల్లాఖాన్ ఆంధ్రులకు తెలుసా?
తెలంగాణలో ఎయ్యంగ, చూడంగ, రాంగ, పోంగ, నవ్వంగ, ఏడువంగ అనే అంటారు. చెప్పంగ విననోణ్ని చెడంగ చూడాలె అని సామెత. తెలంగాణ భాష కావ్యభాషకు , ద్రావిడ భాషకు, పద్యభాషకు, గ్రాంధిక భాషకు దగ్గర. అది మూలాలను కాపాడుకున్న జీవభాష.
తెలంగాణ భాషకు లయబద్ధమైన ఒక ఏర్పాటు ఉన్నది. కారణం కొన్ని అక్షరాల్ని ద్విత్వంగా మార్చడం. తట్ట తట్ట కాళ్లు కొట్టుడు, జెప్పజెప్ప పని చేసుడు మొదలగునవి. ఇంత గొప్ప తెలంగాణ భాషను అసలు భాషే కాదని ఈసడించిన వాళ్లు వలస వాదులు. భాషారంగంలోనే ఎక్కువ వివక్ష సాగింది. 'చల్ల' మాండలికమట. 'మజ్జిగ' భాషనట. 'దర్జీ' పదానికి తెలుగులో పదమే లేదట. 'మేర' ఏమిటి?
ఆంగ్లేయుడైన బ్రౌన్కున్న నిజాయితీ సీతారామాచార్యులు ఆంధ్రుడై ఉండి లేకపోయింది. బ్రౌన్ నిఘంటువులో తమరు అన్న పదముంది. తెలంగాణలో ఒక వ్యక్తికి గౌరవ వాచకం తమరు. ఆంధ్రలో మీరు. నిజానికి తెలంగాణలో ఎదుటివాడు ఒక్కడైతే నువ్వు. ఒకనికన్నా ఎక్కువైతేనే మీరు. ఒక్కణ్ని పట్టుకుని మీరు అనడం తెలంగాణలో సహజ జీవితానికి విరుద్ధం. ఇదీ సమైక్యవాదం.
వ్యాకరణాల విషయంలోనూ చిన్నచూపే. చిన్నయసూరి తమిళ ప్రాంతీయుడు కనుక తెలంగాణ పదజాలం పట్టుకోలేదు. వస్తాడు. తెస్తాడు. అన్నాడు గానీ వస్తడు, తెస్తడు అనలేదు. పుష్పవిలాపం కన్న ముందు వచ్చిన వృక్షవిలాపం ప్రస్తావన సాహిత్యంలో లేదు.
మొదటి అచ్చ తెలుగు కావ్యం రాసిన పొన్నెగంటి తెలుగన్న ఆంధ్రన్నల ప్రభావంతో అదృశ్యమైపోతున్నాడు. మన్యం వీరుడు 'అల్లూరి' చాటున 'కొదమసింగం కొమురం భీము' కన్పించకుండా పోయాడు.
సంస్కృతి సంప్రదాయాల విషయంలో అట్లతద్దికి దక్కిన ఖదర్ బతుకమ్మకు దొరకలేదు. పండుగలు పబ్బాల్లో తెలంగాణలో పెద్ద పండుగైన దసరా చిన్నదైపోయింది. ఆంధ్రలో పెద్ద పండుగైన ‘సంక్షికాంతి' చాలా పెద్దదై కూర్చుంది. చల్లపోయింది. అంబలి మాయమైంది. ఆహారపుటలవాట్లు పాడుచేశారు.
ఉన్నోడు, లేనోడు, లేశినోడు, లెవ్వనోడు, ఉమ్మయ్మ జక్కయ్య మనమందరం కండ్లుదెర్వాలె. ఇప్పుడున్న మనకు సురుకు పుట్టాలె.
సీమాంధ్ర ప్రజలుగా... తెలంగాణ ప్రజలు గా విడి పోదాం...
తరువాత ప్రపంచ తెలుగు మహోత్సవాలు జరుపుకుందాం !!!
(తెలంగాణ రాష్ట్రం కోసం వేయిమంది ఆత్మబలిదానాలు చేసుకున్నా కదలని సిడ్నీ తెలుగు ప్రజలుకు తెలుగు పేరున ఉత్సవాలు జరపటాన్ని నిరసిస్తూ తెలంగాణ ప్రజలు బహిష్కరణకు పిలుపునిచ్చిన సందర్భంగా..)
- వినోద్ ఏలేటి












Click it and Unblock the Notifications