మల్లు రవి: సోనియా గాంధీ తప్పు చేయలేదు
తెలంగాణ ఉద్యమం ఆరు శతాబ్ధాలకు పైగా కొనసాగుతోంది. అయినా మూడు తరాల నాయకులు కూడా ఈ అంశంపై ఎలాంటి చొరవ తీసుకోలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతూ సాగిన ఈ ఉద్యమంలో వందలాది మంది ఉద్యమకారులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. జవహర్ లాల్ నెహ్రూ కాలం నుంచి ప్రస్తుత సోనియా గాంధీ కాలం వరకూ ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ఎంతో సున్నితమైన, క్లిష్టతరమైన ఈ అంశాన్ని పరిష్కరించేందుకు ఇప్పటి వరకు ఎవరూ చొరవ తీసుకునేందుకు ముందుకు రాలేదు.
తెలంగాణ అంశంపై క్షుణ్ణంగా పరిశీలించి, ఇరు ప్రాంతాల నేతలలో చర్చించిన తర్వాత, తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామనే సాటిలేని నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రత్యేక రాష్ట్ర ప్రకటన ఇప్పుడు చేయడం సరికాదని విమర్శిస్తుండటం విచారకరం.
కొన్ని రాజకీయ పార్టీలు సోనియా గాంధీని ఎందుకు తప్పుపడుతున్నాయో? ఆమె ఏం తప్పు చేశారో అర్థం కావడం లేదు. ఎందరో నాయకులు క్లిష్టమైన తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు, కానీ వారు విజయవంతం కాకపోవడంతో ఆ సమస్య ఇప్పటికీ కొనసాగుతూ వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో సోనియా గాంధీ తన నిర్ణయంతో తెలంగాణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి వారికి అనుకూల నిర్ణయాన్ని ప్రకటించారు.
సోనియా గాంధీని విమర్శించే ముందు తెలంగాణ ఉద్యమం గురించి లోతైన అవగాహన కలిగి ఉండాలి. తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపాలని మూడు తరాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీని ఆశ్రయించారు. మారుమూల గ్రామాల నుంచి నగరాల వరకూ బలమైన తెలంగాణ ఉద్యమాన్ని ప్రజలు కొనసాగించారు. ఉద్యమంలో ప్రాణ త్యాగాలకు సైతం ప్రజలు వెనకాడలేదు. సకల జనుల సమ్మెతో తెలంగాణ ప్రజలు తమ ఆకాంక్షను చాటుకున్నారు.
భాషా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణతో కలిపి ఏర్పాటు చేసిన నాటి నుంచే తెలంగాణ ప్రాంత నాయకులు తీవ్ర అసంతృప్తి, అనుమానాలను కలిగి ఉన్నారు. నాయకుల్లోని అనుమానాలను, భయాలను తొలగించేందుకు అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పెద్ద మనుషుల ఒప్పందాన్ని కుదిర్చారు. దీంతో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిసి సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా 1956, నవంబర్ 1న ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 12 సంవత్సరాలపాటు కొనసాగినప్పటికీ, ఉద్యోగాలలు, ఇతర అంశాలలో వివక్ష కొనసాగడంతో తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో 1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైంది. విద్యార్థులతో ప్రారంభమైన ఈ ఉద్యమం రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లడంతో తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపు దాల్చింది. తెలంగాణ కోసం వందలాది మంది విద్యార్థులు తమ ప్రాణాలను త్యాగం చేయగా, మరికొంతమంది విద్యార్థులు పోలీసుల తూటాలకు బలయ్యారు.
అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నించారు. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న మర్రి చెన్నారెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రజా సమితిని ఇందిరా గాంధీ తన అసమానమైన శైలితో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయించారు. ఆ తర్వాత తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడానికి కోసం చట్ట బద్దమైన ఆరు సూత్రాల ఫార్మాలాను రూపొందించించడం జరిగింది. అప్పటి నుంచి రాజీవ్ గాంధీ కాలం వరకూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగిన దాఖలాలు లేవు. దీంతో తెలంగాణ సమస్యపై ఎలాంటి ప్రకటన చేయాల్సిన అవసరం లేకుండానే ఆయన తన పదవీ కాలాన్ని పూర్తి చేశారు.
అయితే తొలి దశలో తెలంగాణ ఉద్యమం ఎంతటి తీవ్ర రూపు దాల్చి కొనసాగిందో అదే స్థాయిలో మళ్లీ రెండవ దశలో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ఉవ్వెత్తున సాగిన తెలంగాణ ఉద్యమం ప్రత్యేక రాష్ట్రం సాధించే వరకూ కొనసాగింది. తెలంగాణ సమస్యను ఇంకా కొనసాగించకూడదనే ఉద్దేశంతో సోనియా గాంధీ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సోనియా గాంధీ తన నిర్ణయంతో తెలంగాణ సమస్యకు శాశ్వత పరిస్కారం చూపారు. దశాద్ధాలుగా కొనసాగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించారు కాబట్టే, సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు తప్ప, మరొకటి కాదని చెప్పవచ్చు.
రాష్ట్రంలోని అన్ని పార్టీలను సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అనేక సమావేశాలు నిర్వహించడం, సంప్రదింపులు చేయడం, అనేక కమిటీలు ఇందుకోసం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టారు. 2004 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావుతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన సమయంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడం జరిగింది.
ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి, ఇతర హామీలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్న వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత కెసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. కెసిఆర్కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. తెలంగాణ ఉద్యమాలతో రగిలిపోయింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది.
ఇతర పార్టీల అభిప్రాయం మేరకు ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ నియమించడం, అఖిలపక్ష సమావేశాలు నిర్వహించడం, అన్ని పార్టీల అభిప్రాయలను సేకరించిన తర్వాతే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. టిఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని తిరిగి అధికారంలోకి రావడానికి, కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం కోసం కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ చేపట్టిందని చేస్తున్న తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల నాయకుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. గతంలో తెలంగాణకు అనుకూలమని చెప్పి, నిర్ణయం తీసుకున్న తర్వాత ఇలాంటి ఆరోపణలు చేయడం వారికి సరికాదు.
ప్రస్తుత పార్టీల వైఖరితో ప్రజలకు వాస్తవం తేటతెల్లమవుతోంది. భారతీయ సంస్కృతి, లక్షణాలను స్వీకరించిన సోనియా గాంధీకి సమాధులు కట్టడం, ఆరోపణలు చేయడం సబబు కాదు. అన్ని ఆరోపణలను నవ్వుతూ బరించి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం, ఆమెను తెలంగాణ ప్రజలు ఆరాధించేలా చేసింది.
-డా.
మల్లు
రవి,
మాజీ
ఎంపి,
ఏపిసిసి
అధికార
ప్రతినిధి