హైదరాబాద్: లైంగిక వేధింపుల బారిన 14% పిల్లలు
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాదులోని వీధి బాలల పరిస్థితిపై ఓ నివేదిక ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించింది. వారిలో 93 శాతం మంది పిల్లలు తమ ప్రాణాలకు ముప్పును ఎదుర్కుంటున్నారని, వారిలో 14 శాతం మంది లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఓ నివేదిక వెల్లడించింది.
పిల్లల రక్షణ కోసం ఏర్పడిన ఓ ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో) హైదరాబాదులోని వీధి బాలలపై ఓ నివేదికను తయారు చేసింది. హైదరాబాదులో దాదాపు పది వేల మంది వీధి బాలలు ఉన్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. కొంత మంది పిల్లలను ఆ ఎన్జీవో ఇంటర్వ్యూ చేసింది. వారిలో 20 శాతం మంది తాము పోలీసుల నుంచి చిక్కులు ఎదుర్కుంటున్నామని చెప్పారు.
తమ వద్ద ఉన్న కొద్దిపాటి వస్తువులు కూడా చోరీకి గురవుతున్నాయని 33 శాతం మంది చెప్పగా, తమ ప్రాణాలకు ముప్పును ఎదుర్కుంటున్నామని 38 శాతం మంది చెప్పారు. వీధి బాలల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు ఏవీ లేవని ఎన్జీవో వ్యాఖ్యానించింది. శారీరర, లైంగిక వేధింపులను బట్టి తాము ఆ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తర్వాత వీధి బాలలు ఎక్కువగా ఉన్న రైల్వే స్టేషన్లు సికింద్రబాద్, హైదరాబాద్, విశాఖపట్నాలేనని ఎన్డీవో తన నివేదికలో తెలిపింది. ప్రభుత్వ సేవలను అదుకోవడానికి అవసరమైన పత్రాలు వారి వద్ద లేవని చెప్పింది.
వంద స్మార్ట్ సిటీలకు ప్రణాళికలు వేస్తున్నప్పుడు వీధి బాలలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఎన్జీవో ప్రభుత్వాలను కోరింది. పేదరికం కారణంగానే దాదాపు 14 శాతం మంది పిల్లలు రోడ్ల మీద పడుతున్నారని ఆ నివేదిక తెలిపింది. సగం మంది పిల్లలకు రాత్రుళ్లు ఉండడానికి తగిన ఆశ్రయాలు కూడా లేవు.