ద్రవిడ్ రాజకీయం
పాకిస్తానుతో జరిగే వన్డేలకు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ ను ఎంపిక చేయకపోవడం వివాదాలకు దారి తీసింది. పాకిస్తానుతో జరిగే తొలి రెండు వన్డేలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) జరిపిన భారత జట్టు ఎంపిక పలువురిని ఆశ్చర్య పరిచింది. ద్రావిడ్ ను తొలగించడం దానికి ఒక కారణమైతే అంతగా ఫామ్ లో లేని వీరేంద్ర సెహ్వాగ్ కు స్థానం కల్పించడం మరో కారణం. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచుల్లో సెహ్వాగ్ రికార్డు బాగుండడమే అందుకు కారణమని భావించినా ద్రవిడ్ తొలగింపు మాత్రం చాలా మందికి మింగుడు పడడం లేదు. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచుల్లో ద్రవిడ్ చాలా పేలవమైన ఆటను కనబరిచాడు. ఏ స్థితిలోనూ అతను రాణించలేదు సరికదా ఏ మాత్రం అనుభవం లేని ఆటగాడిగా కన్పించాడు.
చాలా సార్లు ద్రవిడ్ జట్టును ఆదుకున్న సంఘటనల దృష్ట్యా ఆస్ట్రేలియాతో రాణించకపోవడం అనేది తొలగింపునకు కారణం కారాదనే వాదన ఉంది. అయితే ద్రవిడ్ గంగూలీ కెప్టెనుగా ఉన్న కాలంలో కీపింగ్ బాధ్యతలు కూడా చేపట్టాడు. ఇప్పుడు కెప్టెనే కీపర్ కావడంతో ద్రావిడ్ కు అదనంగా కీపింగ్ బాధ్యతలు అప్పగించే పరిస్థితి లేదు. ద్రవిడ్ ను బ్యాట్స్ మనుగా తప్ప జట్టులో కొనసాగించే పరిస్థితి లేదు. సచిన్ టెండూల్కర్, గంగూలీ అవసరమైతే బౌలింగ్ చేయగలరు. అలాగే సెహ్వాగ్ కూడా బౌలింగుకు పనికి వస్తాడు. సెలెక్టర్లు ఆల్ రౌండర్ల కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నారనే విషయం అర్థమవుతూనే ఉంది. దాని వల్లనే బహుశా దినేష్ కార్తిక్ ను పక్కన పెట్టి ఉంటారు. ఆ స్థానంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రవీణ్ కుమార్ ను తీసుకున్నారు. ప్రవీణ్ కుమార్ కు ఆల్ రౌండరుగా పేరుంది. అయితే దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణించినవారు కూడా అంతర్జాతీయ మ్యాచుల్లో విఫలమైన సంఘటనలున్నాయి.
ఇకపోతే ద్రవిడ్ ను తొలగించడాన్ని చీఫ్ సెలెక్టర్ వెంగ్ సర్కార్ సమర్థించుకుంటున్నారు. సీనియర్లను పక్కన పెట్టి గెలిచే జట్టును ఎంపిక చేయాల్సిన అవసరం ఉందనేది అతని వాదన. ద్రవిడ్ ను తొలగించాలని సెలెక్షన్ కమిటీ సమావేశంలో గట్టిగా వాదించింది కూడా అతనే. కాగా అతని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మద్దతు కూడా లభించిందని అంటున్నారు. ధోనీ అంగీరించకపోతే ద్రవిడ్ జట్టులో కొనసాగి ఉండేవాడని అంటున్నారు. అస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో భారత్ బ్యాటింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. టెయిల్ ఎండర్లు ఆడిన మేరకు కూడా ప్రధాన బ్యాట్స్ మెన్ ఆడలేకపోయారు. ద్రవిడ్ ఆటతీరైతే మరీ ఘోరం.
అయితే ద్రవిడ్ తొలగింపు వల్ల జట్టు పరిస్థితి మెరుగు పడుతుందా అంటే అది అనుమానమే. గతంలో గంగూలీని కొంత కాలం పక్కన పెట్టారు. కానీ పరిస్థితి మెరుగు పడలేదు. జట్టులో అనైక్యతే వైఫల్యానికి కారణమని, ఆ వైఫల్యానికి సీనియర్లైన సచిన్, గంగూలీ, ద్రవిడ్ లే కారణమని, వారి రాజకీయాలు జట్టును దెబ్బ తీస్తున్నాయని చెప్పడానికి వీలుంది. కానీ వారిని అదుపు చేయడం, జట్టును ఏకతాటి మీదికి తేవడం పెద్ద సమస్యగా మారింది. ఈ స్థితిలోనే సెలెక్టర్లు అప్పుడప్పుడు విడి విడిగా సీనియర్లను పక్కన పెడుతున్నారు. కానీ పరిస్థితి మెరుగు పడడం లేదు. తన తొలగింపుపై మాట్లాడడానికి ద్రవిడ్ నిరాకరించాడు. ఏమైనా ద్రవిడ్ ను ఎక్కువకాలం పక్కన పెట్టడం కూడా సాధ్యం కాకపోవచ్చు.












Click it and Unblock the Notifications