లక్ష్మణ్ కు అగ్నిపరీక్ష
హైదరాబాద్ సొగసరి బ్యాట్స్ మన్ వివియస్ లక్ష్మణ్ కు పాకిస్తానుతో జరుగనున్న టెస్టు మ్యాచుల సిరీస్ అగ్ని పరీక్షలాంటిదే. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో గురువారంనుంచి జరిగే తొలి టెస్టు మ్యాచులో మైదానంలోకి దిగే తుది 11 మంది ఆటగాళ్లలో లక్ష్మణ్ ఉండే అవకాశం ఉంది. లక్ష్మణ్ కు వన్డే మ్యాచుల్లో అదరగొడుతున్న యువరాజ్ సింగ్ నుంచి గట్టి పోటీ ఉంది. అయితే తొలి టెస్టు మ్యాచులో యువరాజ్ కు తుది జట్టులో స్థానం దక్కకపోవచ్చునని, లక్ష్మణ్ కే అవకాశం ఇవ్వవచ్చునని భావిస్తున్నారు. మ్యాచు ప్రారంభానికి ముందే తుది జట్టును ప్రకటిస్తామని టెస్టు మ్యాచుల కెప్టెన్ అనిల్ కుంబ్లే అంటున్నాడు. గాయం నుంచి కోలుకున్న వైస్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తుది జట్టులో కచ్చితంగా ఉంటాడనడంలో సందేహం లేదు. ఈ స్థితిలో తొలి టెస్టులో లక్ష్మణ్ తప్పకుండా రాణించాల్సి ఉంటుంది.
నిజానికి, దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లో లక్ష్మణ్ కు మంచి అవకాశం లభించింది. ఆయనకు వైస్ కెప్టెన్సీని అప్పగించి దక్షిణాఫ్రికాకు పంపారు. అయితే లక్ష్మణ్ పెద్దగా తన ముద్రను వేయలేకపోయాడు. ఆ తర్వాత జరిగిన దేశవాళీ క్రికెట్ లోనూ లక్ష్మణ్ పెద్దగా రాణించలేదు. దేశంలో ఉత్తమ బ్యాట్స్ మెన్ ల్లో లక్ష్మణ్ పేరు కచ్చితంగా ఉంటుంది. అయితే యువ ఆటగాళ్ల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు చాలా మంది జట్టులో స్థానం కోసం కాచుకుని ఉన్నారు. ఈ స్థితిలో లక్ష్మణ్ తన పూర్వపు సత్తాను చూపాల్సి ఉంటుంది. లేకపోతే కష్టకాలం తప్పదు.
ఇక, గురువారం నుంచి జరిగే తొలి టెస్టు విషయానికి వస్తే అనిల్ కుంబ్లేకు కూడా కెప్టెనుగా సవాల్ లాంటిదే. అనిల్ కుంబ్లేకు కెప్టెన్సీ అప్పగించడంపై నవజ్యోత్ సింగ్ సిద్ధు, అజయ్ జడేజా వంటి మాజీ క్రికెటర్లు వ్యతిరేకిస్తున్నారు. ఈ సమయంలో కుంబ్లే తానేమిటో చూపించాల్సిన అవసరం ఉంది. దానికి తోడు, పేస్ బౌలర్లు శ్రీశాంత్, ఆర్పీ సింగ్ గాయాల కారణంగా తొలి టెస్టు మ్యాచుకు దూరమవుతున్నారు. వారి స్థానంలో మునాఫ్ పటేల్ కు, ఇషాంత్ శర్మకు స్థానం కల్పించారు. ఈ స్థితిలో తుది జట్టు కూర్పులో, నాయకత్వ పటిమలో కుంబ్లే ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.