ధోనీ కెప్టెన్సీ యువ స్పూర్తి

వన్డే సిరీస్ లో విజయానికి ధోనీ అన్ని వైపుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ఎంతో మంది విజయానికి ఆనందంతో ఊగిపోతున్నారు. ఇందులో మొదట చెప్పుకోవాల్సిన వ్యక్తి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సెలెక్షన్ కమిటీ చైర్మన్ దిలీప్ వెంగ్ సర్కార్. సచిన్ టెండూల్కర్ వంటి సీనియర్ గాయంతో దూరమైనా, గాయం కారణంగా వీరేంద్ర సెహ్వాగ్ మొదటి మ్యాచ్ తర్వాత ఆడలేకపోయినా, యువరాజ్ సింగ్ విఫలమైనా యువక్రికెటర్లు భారత్ కు విజయాన్ని అందించి పెట్టారు. ఇది యువ క్రికెటర్ల క్రీడాస్ఫూర్తికి, ధోనీ కెప్టెన్సీకి ప్రశంసలు అందించాల్సిన విషయం.
ధోనీ కెప్టెన్సీని వెంగ్ సర్కార్ మెచ్చుకున్నారు. అతను రెండు మ్యాచుల్లో కీలకమైన దశలో బాగా ఆడడమే కాకుండా విశేషమైన ప్రతిభను కనబరిచాడని వెంగ్ సర్కార్ కొనియాడారు. మురళీథరన్, మెండిస్ లను ఎదుర్కోవడం సాధ్యం కాదని రెండు వారాల క్రితమే భారత బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. ఈ స్థితిలో యువ క్రికెటర్లు వారికి సవాల్ విసిరారు. మిడిల్ ఆర్డర్ లో ఎస్ భద్రీనాథ్, సురేష్ రైనా వంటి యువకులు ఆడిన తీరు ఒక పాఠంలా నిలుస్తుంది. విరాట్ కొహ్లీ ఇన్నింగ్స్ ప్రారంభ జోడీకి సంబంధించిన సమస్యను తీర్చేశాడు. నాలుగో వన్డేలో తన తొలి వన్డే అర్థ సెంచరీ చేసి జట్టు విజయానికి బాటలు వేశాడు. ఈ సందర్భంలో యువకులకు అవకాశం దక్కడం చాలా కష్టమని, తమకు లభించిన అవకాశాన్ని యువకులు అద్భుతంగా వాడుకున్నారని వెంగ్ సర్కార్ అన్నారు.
ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో దెబ్బ తిన్న యువ క్రికెటర్లు బాగానే పాఠాలు నేర్చుకున్నారు. అదరకుండా, బెదరకుండా, వెంటనే భారీ షాట్లకు వెళ్లకుండా, వికెట్లను కాపాడుకుంటూ పరుగులు చేయడం ఎలాగో, శ్రీలంక స్పిన్నర్ల ద్వయం మురళీథర్, మెండిస్ లను ఎలా ఎదుర్కోవాలో చేసి చూపించారు. ఏ మాత్రం అనుభవం లేని భద్రీనాథ్, కోహ్లీ వంటి క్రీడాకారులు కూడా అందులో విజయం సాధించడం చెప్పుకోదగ్గ విషయం. మురళీధర్ బౌలింగులో సురేష్ రైనా కొట్టిన షాట్లు, మెండిస్ ను సరిగ్గా అంచనా వేసి ఆడిన తీరు మెచ్చుకోదగ్గ విషయం. తాను మెండిస్, మురళీల చేతులను అధ్యయనం చేశానని, వాళ్ల బౌలింగ్ ను చదవగలిగితే తాను బాగా ఆడగలనని సురేష్ రైనా చెప్పాడు. రైనా నాలుగో వన్డేలో కీలకమైన 76 పరుగులు చేయడమే కాకుండా అతని స్ట్రయిక్ రేట్ 96 ఉంది. ధోనీ వికెట్ల వద్ద నిలదొక్కుకోవడం శ్రీలంక బౌలర్లకు దడ పుట్టించిందనే చెప్పాలి.
శ్రీలంక స్పిన్ మాంత్రికులను ఎలా ఎదుర్కోవాలో భారత బ్యాట్స్ మెన్ నేర్చుకున్నారు కానీ హర్భజన్ ను ఎదుర్కోవడాన్ని శ్రీలంక బ్యాట్స్ మెన్ నేర్చుకోలేక పోయారు. ఇది కూడా భారత్ కు కలిసి వచ్చింది. తమ బ్యాటింగే తమను దెబ్బ తీసిందని శ్రీలంక కెప్టెన్ మహేలా జయవర్ధనే అన్నారు. తమకు అవకాశం వచ్చిందని, అయితే వాడుకోలేకపోయామని ఆయన అన్నారు. మొత్తంగా చూస్తే తమ బ్యాటింగ్ బాగా లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
