గుప్తనిధులకు పేరొందిన కేరళ దేవాలయం ఇపుడు ముంబైలోనే !

ఈ దేవాలయ నకలును నిర్మించి అత్యధికంగా ప్రజలను ఆకర్షించటమే లక్ష్యమని అంధేరిచా రాజా సార్వజనిక్ గణేశోత్సవ మండలి చెపుతోంది. ఈ మండలి ఏటా రకరకాల ఆకర్షణీయమైన అలంకరణలు గణేశ ఉత్సవ పందిళ్ళలో చేస్తుంది.
గుజరాత్ లోని అక్షర ధామాన్ని కూడా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తోగతంలో నిర్మించింది. పందిళ్ళలో గణేషుడి విగ్రహ ముందరి భాగంలో ఈ ఆకర్షణీయ ఖ్యాతిగాంచిన దేవాలయాల నిర్మాణాల నకళ్ళను పెట్టి ప్రజలను ఆకర్షించటం ఈ మండలి చేసే ప్రత్యేక పని గా మండలికి చెందిన ఉదయ్ సాలిన్ చెపుతారు. అక్షర ధామ్ గుడి నమూనాలను ఆర్టు డైరెక్టర్ అనంత షిండే చిత్రీకరిస్తున్నారు. ఇక ఇసుకతో నిర్మించబడుతున్న కేరళ దేవాలయం సైకత శిల్పి మన్మోహన్ మహాపాత్ర నిర్మిస్తున్నారు. గత సంవత్సరం ఈయన సోమనాధ్ దేవాలయ నకలును నిర్మించారు. ఆ నిర్మాణంలో 14 రోజులు పట్టిందని, ఇక ఇపుడు కేరళ దేవాలయ నకలు నిర్మాణానికి ఇసుక కొరకై అన్వేషిస్తున్నామని మహాపాత్ర చెపుతున్నారు. ఇసుక నిపుణులు దేవాలయ సూక్ష్మ పరిశీలనలకై కేరళ వెళ్ళారట. ఈ సైకత నిర్మాణపు ఎత్తు 18 అడుగులు వుండి నిర్మాణపు ప్రదేశం పూర్తిగా ఎయిర్ కండిషన్ చేస్తారట.
సుమారు 22 బిలియన్ డాలర్ల విలువ కల గుప్త నిధులు, నాణేలు, ఆభరణాలు, దేవతా మూర్తుల విగ్రహాలు అన్నీ బంగారువేగా బయటపడ్డ కేరళ అనంతపద్మనాభస్వామి దేవాలయం ప్రపంచంలోనే ఒక అరుదైన సంఘటనగా చెప్పవచ్చు. ఈ దేవాలయంలోని ఆరో గది లో ఏముందనేది ఇంకా సస్పెన్స్ గానే వుండటం మరో విశేషం.












Click it and Unblock the Notifications