ఇది జగన్ మార్క్ ఓదార్పు యాత్ర!
జగన్ తన ఓదార్పు యాత్రలో ఓదార్పు కాకుండా వైయస్సాఆర్ విగ్రహాల ఆవిష్కరణ పైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని టిడిపి తదితర పార్టీలు సైతం విమర్శించాయి. ఓదార్పు యాత్ర పేరుతో జగన్ రాజకీయ యాత్ర చేస్తున్నారని విమర్శిస్తున్నారు. రాజకీయంగా ప్రజల్లో నానడానికే ఆయన ఏళ్లకు ఏళ్లు ఓదార్పు యాత్ర చేస్తున్నారని విమర్శిస్తున్నారు. రెండేళ్లైనా వైయస్ మృతి కారణంగా చనిపోయిన వారికి కాంగ్రెసు పార్టీ డబ్బులు ఇవ్వడం లేదని ప్రశ్నించే జగన్ తన ఓదార్పు యాత్రను ఏళ్లకేళ్లు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే వైయస్సాఆర్ మృతిని తట్టుకోలేక సుమారు ఆరు వందల మంది వరకు చనిపోయారని వారిని ఓదార్చడానికే జగన్ వెళుతున్నారనేది జగన్ వర్గం వాదన.
జగన్ కాంగ్రెసులో ఉన్న సమయంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని సైతం హంగూ ఆర్భాటం లేకుండా జిల్లా కేంద్రాల వద్దకు అందరినీ పిలిచి సహాయం అందించాల్సిందిగా సూచించారని జగన్ ప్రకటించారు. అలా వారిని పిలిపించుకొని సహాయం చేయడం తెలుగు సంప్రదాయం కాదని చెప్పిన జగన్ అందరిని ఓదార్చడానికి మరింకెంత సమయం తీసుకుంటారో చెప్పాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. పిలిపించుకోవడం సంప్రదాయం కాదని చెప్పే జగన్కు ఇన్నాళ్లు అర్బాటంతో వెళ్లడం సాంప్రదాయం కాదని తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. 2014లో సాధారణ ఎన్నికలు జరుగుతాయి. రాజకీయ లబ్ధి కోసం ఆలోచించే జగన్ అప్పటి వరకు తన ఓదార్పు యాత్రను కొనసాగించినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని పలువురు విమర్శిస్తున్నారు.