భాను దాక్కున్న శియోనిది పెద్ద చరిత్రే
శియోనికి వెళ్లి అక్కడ రకరకాల సౌకర్యాలను సమకూర్చుకోవడాన్ని బట్టి చూస్తే భాను కిరణ్కు దానితో పాత పరిచయం ఉండి ఉంటుందని, భాను కిరణ్కు అక్కడివాళ్లతో సంబంధాలు ఉండి ఉంటాయని సిఐడి అధికారులు అనుమానిస్తున్నారు. ఇల్లు అద్దెకు ఇచ్చే విషయంలో తనను ఎవరూ ఏమీ అడగలేదని భాను సిఐడి అధికారులకు చెప్పారు. స్థానికులతో పరిచయాలు ఏర్పరచుకుని తనకు కావాల్సినవాటని సమకూర్చుకున్నట్లు అతను చెప్పాడు. కానీ అది అంత సులభం కాదని సిఐడి అధికారులు భావిస్తున్నారు.
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో సహ నిందితుడు, అనుచరుడు మన్మోహన్ సింగ్తో వాగ్వివాదం జరిగిన తర్వాత వెంటనే భాను కిరణ్ శియోనికి వెళ్లిపోయాడు. అంతకు ముందు వీరిద్దరు గుర్గావ్లోని ఓ లాడ్జిలో ఉన్నారు. మన్మోహన్ సింగ్ తన కుటుంబ సభ్యులతో తరుచుగా మాట్లాడుతుండడం భానుకు కోపం తెప్పించింది. ఈ విషయంపై ఇరువురి మధ్య తగాదా జరిగిన రాత్రి నుంచి మన్మోహన్ సింగ్ కనిపించకుండా పోయాడు. మన్మోహన్ ద్వారా పట్టుబడవచ్చుననే భయంతో భాను శియోని చేరుకున్నాడు. శియోనికే భాను ఎందుకు వెళ్లాడనే విషయంపై సిఐడి అధికారులు దృష్టి పెట్టారు.
శియోని నేరాలకు పెట్టింది పేరని అంటారు. క్రైమ్ రేటు ఈ జిల్లాలో ఎక్కువగా ఉంటుంది. శియోని, ఛింద్వారాల నుంచి నేరస్థులకు మందుగుండు సామగ్రి సరఫరా అవుతుందని అంటారు. క్లయింట్లకు ఈ ప్రాంతాల నుంచే హ్యాండ్ మేడ్ ఆయుధాలు సరఫరా అవుతాయట. దాంతో శియోనితో భాను కిరణ్కు పాత పరిచయం ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు.
సూరిని హత్య చేసిన వెంటనే తాను తన తల్లి మీనా కుమారికి సమాచారం అందించానని, ఆ తర్వాత కుటుంబ సభ్యులకు విషయం చెప్పానని, అక్కడి నుంచి ఎటైనా వెళ్లిపోవాలని సూచించానని భాను కిరణ్ సిఐడి విచారణలో చెప్పాడు. సూరిని హత్య చేసేందుకు భాను కిరణ్ రచించిన పథకం గురించి అతని కుటుంబ సభ్యులకు ముందే తెలుసునని సిఐడి అధికారులు అనుమానిస్తున్నారు.