మద్యం: రోజుకు 65 కోట్లు తాగుతున్నారు

రాష్ట్రంలో మద్యం షాపులకు వేలం పాటలు నిర్వహించలేదు, గతంలో కన్నా ఈ ఏడాది మద్యం షాపుల సంఖ్య తగ్గింది. అయినా ఆదాయం మాత్రం తగ్గలేదు.‘ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి అనేక మార్గాలున్నాయి, మద్యంపై వచ్చే ఆదాయం కోసం చూడటం లేదు, అందుకే షాపుల వేలానికి స్వస్తిపలికి, ఫిక్స్డ్ లైసెన్స్ ఫీజు విధానం ప్రవేశపెడుతున్నాం' అని ముఖ్యమంత్రి ఎన్ కిరణ్కుమార్రెడ్డి చెప్పారు. నిరుడు జూలైలో మద్యం షాపులకు కొత్త లైసెన్స్లు జారీ చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి చెప్పిన మాటల్లో ఏ మాత్రం నిజం లేదనేది ఈ ఎనిమిది నెలల వ్యవధిలో ప్రభుత్వ ఖజానాకు సమకూరిన మద్యం రాబడితో తెలిసిపోతోంది. మద్యం షాపుల సంఖ్య గతంలో 6596 ఉంటే, అది ఈ ఏడాది 5979కి తగ్గింది. అలాగే మద్యం షాపులకు వేలం పాటలను రద్దు చేయడం వల్ల సమారు 100 కోట్ల ఆదాయం తగ్గింది. ఈ లెక్కన ఈ ఏడాది మద్యం అమ్మకాలపై వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గాలి. కానీ గతంలో కన్నా ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం ఈ ఏడాది పెరగనుంది. ప్రభుత్వ మాయాజాలం ఇందుకు దోహదం చేస్తోంది.
ఆబ్కారీ సంవత్సరం గత ఏడాది జూలై నెల నుంచి ప్రారంభమై, ఈ ఏడాది జూన్ నెలఖారుతో ముగియనుంది. ఫిబ్రవరి నెలాఖరు నాటికి ఎనిమిది నెలల వ్యవధిలో ఆబ్కారీ ఆదాయం 16,514 కోట్లకు చేరుకుంది. ఇంకా మిగిలిన నాలుగు నెలల్లో ఇప్పటివరకు జరిగిన అమ్మకాల ప్రకారం నెలకు రెండు వేల కోట్ల రూపాయల చొప్పున మరో 8 వేల కోట్ల ఆదాయం రానుంది. అంటే ఈ ఏడాది ఆబ్కారీ ఆదాయం రూ. 24 వేల కోట్లకు చేరుకోనుంది. అంటే రాష్ట్రంలో సగటున రోజుకు 66 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.
గతంతో పోలిస్తే మద్యం ఆదాయం ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా పెరుగుతోంది. ఆబ్కారీ సుంకం పెరగడం, మద్యం ధరల పెరుగుదల, అమ్మకాల టర్నోవర్ ఆరు రెట్లు పెరిగిన తర్వాత 15 శాతాన్ని అదనంగా చెల్లించడం వంటి నిబంధనలు ఆబ్కారీ ఆదాయం ఇబ్బడి, ముబ్బడిగా పెరగడానికి దోహదపడ్డాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications