టెండూల్కర్ను బీట్ చేసిన రికీ పాంటింగ్
టాస్మానియా తరఫున ఆడుతున్న రికీ పాంటింగ్ బుధవారం ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తన 79వ సెంచరీని నమోదు చేసి టెండూల్కర్కు దగ్గరగా వచ్చాడు. టెండూల్కర్ ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 80 సెంచరీలు చేశాడు. మరో సెంచరీ చేస్తే పాంటింగ్ టెండూల్కర్తో సమానవుతున్నాడు. కాగా, గురువారం పాంటింగ్ 200 పరుగులు చేసి నాటవుట్గా మిగిలాడు.
పాంటింగ్ డబుల్ సెంచరీ చేసిన తర్వాత టాస్మానియా న్యూ సౌత్ వేల్స్పై జరుగుతున్న మ్యాచులో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. ఈ డబుల్ సెంచరీతో రికీ పాంటింగ్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పాంటింగ్ 9 డబుల్ సెంచరీలు నమోదు చేసి రికార్డు సృష్టించాడు. టెండూల్కర్ ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 8 డబుల్ సెంచరీలు మాత్రమే చేశాడు.
పాంటింగ్ టెస్టు మ్యాచుల్లో ఆరు, షీఫీల్డ్ షీల్డ్లో మూడు డబుల్ సెంచరీలు చేశాడు. టెండూల్కర్ టెస్టు మ్యాచుల్లో ఆరు డబుల్ సెంచరీలు, ఒకటి రంజీ ట్రోఫీలో, రెండోది 1988లో భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాపై ముంబై జట్టు కోసం ఆడిన మ్యాచులో చేశాడు.
సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం ఇరానీ ట్రోఫీలో రెస్టాఫ్ ఇండియాపై జరుగుతున్న మ్యాచులో ముంబై తరఫున ఆడుతున్నాడు. సచిన్ టెండూల్కర్ మరో 104 పరుగులు చేస్తే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 25 వేల పరుగుల మైలురాయిని దాటుతాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఈసారి రికీ పాంటింగ్, సచిన్ టెండూల్కర్ కలిసి ఒకే జట్టు కోసం ఆడబోతున్నారు.