హీరో నుండి..: రెండేళ్ల జగన్ పార్టీ ప్రస్థానం
కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి నేటితో రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ రెండేళ్లలో ఆ పార్టీకి చేదు కంటే తీపే ఎక్కువగా ఉంది. అదే సమయంలో ఇటీవల ఆ పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా కనిపిస్తోంది. వైయస్ జగన్ రెండేళ్ల క్రితం ఇడుపులపాయ వద్ద దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి సమాధి సాక్షిగా 2012లో ఇదే రోజున తన తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు రోజు జగన్ తూర్పు గోదావరి జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు అంటూ పార్టీ పేరును ప్రకటించారు.
ఈ రెండేళ్లలో జగన్ అధికార పార్టీ కాంగ్రెసు, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి చుక్కలు చూపించారు. ఇటీవల తెలంగాణలో తన శక్తిని చాటుకునే ప్రయత్నం చేసి తెలంగాణ రాష్ట్ర సమితికి ముచ్చెమటలు పట్టించారు. రెండేళ్లలో వచ్చిన ప్రతి ఉప ఎన్నికలో జగన్ పార్టీ ఘన విజయం సాధించింది. ఉప ఎన్నికల్లో విజయంతో దూసుకుపోయింది. ప్రజలు తమ వైపే ఉన్నారని, కాంగ్రెసును ఇంటికి పంపించేందుకు, టిడిపిని మట్టికరిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ ప్రకటనలు చేసింది.
కిరణ్, బాబు, కెసిఆర్లకు ముచ్చెమటలు పట్టించిన జగన్ పార్టీ పరిస్థితి ఇటీవల ఆశించినట్లుగా లేదనే చెప్పవచ్చు. ఎన్నికల విషయానికి వస్తే ఉప ఎన్నికల్లో ఘన విజయం మినహా సహకార ఎన్నికల్లో పరాభవం తప్పలేదు. జగన్ గ్రాప్ క్రమంగా తగ్గిపోతుందనేందుకు ఇదే మంచి నిదర్శనం అని విపక్షాలు అంటున్నాయి. ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ కారణంగా గెలిచిందని, ఆ సెంటిమెంట్ క్రమంగా తగ్గిపోవడం వల్లనే సహకార ఎన్నికల్లో ఓడిపోయిందని లెక్కలు వేసుకుంటున్నారు.
జగన్ గ్రాప్ తగ్గిపోతుందనే వాదనలకు తోడు ఇటీవల పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో పలువురు టిక్కెట్ ఆశిస్తూ మొదటి నుండి పని చేస్తున్నారు. మరోవైపు జగన్ ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా పలువురు ఎమ్మెల్యేలను తన వైపుకు లాక్కుంటున్నారు. తద్వారా పాత వారికి, కొత్త వారికి మధ్య విబేధాలు పొడసూపుతున్నాయి. ఎవరికి వారు తమకు జగన్ టిక్కెట్ పైన హామీ ఇచ్చారని చెబుతుండగా.. మరికొందరు ఎప్పటి నుండో పార్టీ కోసం పని చేస్తున్న తమను కాదని కొత్త వారికి హామీ ఇస్తున్నారని బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల అద్దంకి, కాకినాడ రూరల్ నియోజకవర్గాల కార్యకర్తలు హైదరాబాద్ సెంట్రల్ కార్యాలయానికి వచ్చి ఆందోళన సాగించారు. టిక్కెట్ కోసం కుమ్ములాటలు వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశాలు బాగానే ఉన్నాయి. ఇతర పార్టీల్లో కొన్ని నియోజకవర్గాల్లో పోటీ సహజం. కానీ, జగన్ పార్టీలో చాలా నియోజకవర్గాల్లో ఈ పోటీ నెలకొని ఉంది. ఇదే పార్టీని నష్టపర్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
మరోవైపు పార్టీ స్థాపించిన పదిహేను నెలలకే పార్టీ పటిష్టత కోసం పని చేస్తున్న సమయంలో జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టయ్యారు. అన్నింటికి మించి ఇది ఆ పార్టీని కుంగదీస్తున్న అంశం. జగన్ బెయిల్ పై ఇప్పుడు బయటకు వస్తారని... అప్పుడు బయటకు వస్తారని ఆ పార్టీ క్యాడర్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది. ఈ ఏప్రిల్లో ఎలాగైనా వస్తుందని ఆ పార్టీ గట్టి నమ్మకంతో ఉంది. వస్తే ఆ పార్టీకి పెద్ద ఊపు వచ్చినట్లే. లేదంటే ఇప్పటికంటే ఎక్కువ నిస్తేజం ఆ పార్టీని ఆవరించడం ఖాయమంటున్నారు.
నాయకత్వ లేమి కారణంగా శ్రేణుల్లో విశ్వాసం సన్నగిల్లిందనే చెప్పవచ్చు. కొద్దో గొప్పో జగన్ సోదరి షర్మిల పార్టీ పటిష్టత కోసం మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా చేస్తున్నారు. జగన్ పార్టీ ప్రారంభించిన సమయంలో ఒక వెలుగు వెలుగుతున్నట్లు కనిపించిన పార్టీలో ఇప్పుడు చీకట్లు కమ్ముకంటున్నాయనే చెబుతున్నారు. జగన్ పార్టీని స్థాపించినప్పుడు హీరోగా వెలుగొందాడు. సోనియాను ఎదిరించిన నేతగా జాతీయ స్థాయిలో ఆకర్షించబడ్డాడు.
ఎంపి పదవికి, కాంగ్రెసుకు రాజీనామా చేసిన జగన్
ఇడుపులపాయ వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జెండాను ఆవిష్కరించారు.
కాంగ్రెసుతో విబేధాలు తెచ్చిన ఓదార్పు యాత్!
ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ హవా కొనసాగింది.
జగన్ను సిబిఐ గతేడాది మే 27న అరెస్టు చేసింది.
జగన్ అరెస్టుతో విజయమ్మ సహా కుటుంబం ధర్నాకు దిగింది.
జగన్ అరెస్టు నేపథ్యంలో తర్వాత జరిగిన ఉప ఎన్నికల ప్రచార బాధ్యతలను సోదరి షర్మిల తీసుకున్నారు.
బాబు యాత్రకు పోటీగా.. పార్టీ పటిష్టత కోసం షర్మిల భారీ పాదయాత్రను ప్రారంభించారు.
కడప జిల్లాలో ఆయా నియోజకవర్గాల్లో టిక్కెట్ల కోసం వైయస్ కుటుంబంలో కోల్డ్ వార్ జరుగుతోందనే వార్తలు వచ్చాయి. పార్టీలోను ఒకరి కంటే ఎక్కువ ఆశావహులు ఉండటంతో వచ్చే ఎన్నికల్లో ఇది పార్టీపై ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఓదార్పు యాత్ర, సమీకరించుకున్న జనం, సొంత మీడియా ప్రచారం ద్వారా రాజకీయాల్లోనే కొత్త అధ్యాయానికి తెర లేపారు. కాంగ్రెసును వీడి పులివెందుల అసెంబ్లీ, కడప లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విజయమ్మ, జగన్ భారీ మెజార్టీతో గెలుపొందటంతో వారికి తిరుగులేదనే ప్రచారం జరిగింది. దీంతో పలువురు ఆ పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. తమ బలం చూసి వస్తున్నారని జగన్ పార్టీ చెబుతుండగా.. కొంటున్నారని ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి.
పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం కాలేదనే చెప్పవచ్చు. ఉప ఎన్నికల్లో ఓటమి సెంటిమెంట్ తప్ప బలం కాదనే కాంగ్రెసు, టిడిపిలు చెబుతున్నాయి. ఉప ఎన్నికల్లో విజయమ్మ, షర్మిల కన్నీరు ఉపయోగపడిందని ఆ పార్టీలు ఎద్దేవా చేశాయి. చివరి ఉప ఎన్నికల్లో జగన్ కోసం 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, అందులో తిరిగి 15 మంది గెలిచారు. రెండు కాంగ్రెసు ఖాతాలోకి వెళ్లాయి. నెల్లూరు ఎంపీ స్థానాన్ని కూడా గెలిచారు.
జైలు నుంచే జగన్ చక్రం తిప్పుతున్నారని టిడిపి ఆరోపిస్తోంది. ఇక్కడ జగన్ పార్టీ పరిస్థితి ఇలా ఉంటే, కర్ణాటకలో బిజెపిని ఎదిరించి గాలి అనుచరుడు శ్రీరాములు పెట్టిన పార్టీ కూడా స్థానిక ఎన్నికల్లో చతికిలపడింది. అవినీతి పార్టీలకు కాలం చెల్లిందని కర్నాటక స్థానిక ఎన్నికలు రుజువు చేశాయని టిడిపి జగన్ను ఉద్దేశించి విమర్శించింది. జగన్ కుటుంబంలో టిక్కెట్ల కోసం కోల్డ్ వార్ జరుగుతోందనే వాదనలు కూడా ఉన్నాయి. నాయకత్వలేమి, అంతర్గత విభేదాలు, టిక్కెట్ల పోరు.. ఇవన్నీ జగన్ పార్టీకి అడ్డంకులే అంటున్నారు. కాంగ్రెసుకు ఎదురు తిరిగి పార్టీని స్థాపించిన జగన్ వచ్చే ఎన్నికల్లో ఆశావహుల నుండి తిరుగుబాటు ఎదుర్కోక తప్పదంటున్నారు. ఓదార్పు ద్వారా కాంగ్రెసుకు దూరమైన జగన్ ఇప్పుడు బెయిల్ కోసం వెయిట్ చేస్తున్నారు.