ఇక టార్గెట్ ‘సూర్యుడే’! నాసా వ్యోమనౌక వచ్చే ఏడాదే !!
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ వచ్చే ఏడాది తొలిసారిగా సూర్యుడిపై పరిశోధనకు ఓ వ్యోమనౌకను పంపించనుంది.
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా' తొలిసారిగా సూర్యుడిపై పరిశోధనకు ఓ వ్యోమనౌకను పంపించనుంది. 'సోలార్ ప్రోబ్ ప్లస్ మిషన్' పేరిట చేపట్టనున్న ఈ ప్రయోగాన్ని వచ్చే ఏడాది నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా భగభగమండే సూర్యుడి ఉపరితలం నుంచి ఆరు మిలియన్ల కిలోమీటర్ల దూరానికి ఓ వ్యోమనౌకను పంపుతారు. 'సూర్యుడిపైకి వ్యోమనౌకను పంపుతున్న తొలి ప్రయోగం ఇదే. ఈ వ్యోమనౌక సూర్యుడి ఉపరితలం మీదికి వెళ్లదు. అయితే మూడు కీలక ప్రశ్నలకు సమాధానం కనిపెట్టేంత చేరువకు చేరుకుంటుంది..' అని నాసా గొడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ పరిశోధకుడు ఎరిక్ క్రిస్టియన్ తెలిపారు.
ఒకటి - సూర్యుడి వాతావరణం (కరోనా-రెండు మిలియన్ల డిగ్రీలు) కంటే ఉపరితలం (ప్రోటోస్పియర్-5500 డిగ్రీలు)పై ఉష్ణోగ్రత ఎందుకు తక్కువగా ఉంటుంది?
రెండు-సౌర పవనాలు భారీ వేగాన్ని (గంటకు మిలియన్ మైళ్లు) ఎలా అందుకోగలుగుతున్నాయి?
మూడు- సూర్యుడి నుంచి అప్పుడప్పుడు ఎందుకు అత్యంత శక్తిమంతమైన రేణువులు వెలువడుతున్నాయి?
ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు అన్వేషించేందుకే నాసా ఇప్పుడీ సూర్యుడి సమీపానికి వ్యోమనౌకను పంపే ప్రయోగానికి సిద్ధమైంది.