ఏం తెలివి: టాప్ సీఈవోలకు 'అవర్మైన్' షాకింగ్ హ్యాక్
వాషింగ్టన్: ఇటీవల ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తదితర దిగ్గజ కంపెనీలకు చెందిన సీఈవోల సోషల్ నెట్ వర్కింగ్ ఖాతాలను 'అవర్ మైన్' హ్యాక్ చేసింది. జుకర్ బర్గ్తో పాటు ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ తదితరుల ట్విట్టర్లను హ్యాక్ చేసిన అవర్ మైన్ వారి పాస్వర్డులను బయట పెట్టింది.
తాము సైబర్ సెక్యూరిటీలోని లోపాలను చెప్పేందుకే ఇలా చేస్తున్నామని, తమది సెక్యూరిటీ గ్రూప్ అని అవర్ మైన్ చెప్పుకుంటోంది. టాప్ బాస్ల అకౌంట్లను హ్యాక్ చేయడం ద్వారా అవర్ మైన్ చర్చనీయాంశంగా మారింది.
ఈ అవర్ మైన్ ముగ్గురు యువకుల బృందం. వీరు కేవలం హ్యాకింగే కాకుండా డార్క్వెబ్ నుంచి సమాచారాన్ని సంపాదించి దానితో ఖాతాలు తెరిచేందుకు వినియోగిస్తారు. సుందర్ పిచాయ్కి సంబంధించిన కోరా ఖాతాను కూడా ఈ విధంగానే వారు వినియోగించారు.
వీరు సైబర్ చట్టాలు బలహీనంగా, ప్రాథమిక దశలో ఉన్న దేశాల నుంచి ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. వీరిది సౌదీ అరేబియా అని ప్రకటించుకున్నా, కానీ అక్కడి వారు కాదని తెలుస్తోంది వీరు ప్రాక్సీ సర్వర్లను వాడి ఈ హ్యాకింగ్లకు పాల్పడుతున్నారని చెబుతున్నారు.
ఈ టీనేజర్లది మాతృభాష ఇంగ్లిష్ మాత్రం కాదని టెక్ క్రంచ్ అనుమానం వ్యక్తం చేసింది. ఇటీవల గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కోరా ఖాతాను వారు హ్యాక్ చేశారు. ట్విట్టర్తో అనుసంధానమైన ఈ ఖాతాను హ్యక్ చేసి దానిలో ఎటువంటి సమాచారాన్ని మార్చలేదు. కేవలం కొన్ని పోస్టులు మాత్రమే చేశారు.
జుకర్ బర్గ్ లింక్డిన్ ఖాతాను హ్యక్ చేసినప్పుడే ఆయన సోదరి ర్యాండీ జుకర్ బర్గ్ ట్విట్టర్ ఖాతాను కూడా అదుపులోకి తీసుకుంది. ప్రజల వ్యక్తిగత ఆన్లైన్ ఖాతాలు ఎంత బలహీనంగా ఉంటున్నాయో... వాటిని ఎంత తేలిగ్గా హ్యాక్ చేయవచ్చో వీరు తెలియజేస్తున్నారని చాలామంది భావిస్తున్నారు.
సైబర్ భద్రత కోసమే ఇలా చేస్తున్నామని అవర్ మైన్ చెబుతున్నప్పటికీ.. దీనిని వ్యక్తిగత సంపాదనకు కూడా ఉపయోగించుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుత హ్యకింగ్ల వల్ల వస్తున్న ప్రచారాన్ని వాడుకొని వారి వెబ్సైట్లో సైబర్ సెక్యురిటీ అసెస్మెంట్ సర్వీస్ను ప్రారంభించారు.
వ్యక్తిగత భద్రత ఆడిట్కు 1,000 డాలర్లు, కంపెనీ భద్రత ఆడిట్కు 5,000 డాలర్లు వసూలు చేస్తున్నారు. దీనికోసం వారు ourmine.org వెబ్సైట్ను ప్రారంభించారు. దీనిలో వారు హ్యక్ చేసిన హైప్రొఫైల్ వ్యక్తుల వివరాలు, న్యూస్క్లిప్లు ఉంచారు.