కేటీఆర్ హ్యాపీ: తెలంగాణ కోసం సత్య నాదెళ్ల సిఫార్సు!
హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడుల కోసం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్వయంగా వివిధ సంస్థలకు సిఫార్సు చేశారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం చెప్పారు. హైదరాబాదుకు గూగుల్ సంస్థ వస్తోందని, రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టనుందని చెప్పారు.
ఆన్ లైన్ సంస్థ అమెజాన్ విస్తరిస్తుందన్నారు. తన పర్యటన సత్ఫలితాలిచ్చిందని చెప్పారు. హైదరాబాదులో తమ సంస్థలు నెలకొల్పేందుకు, విస్తరించేందుకు ఐటీ దిగ్గజ సంస్థలు ముందుకు వచ్చాయని చెప్పారు. ఆయన ప్రముఖ తెలుగు దిన పత్రిక ఈనాడు ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీసుకొచ్చిన అవినీతిరహిత, పారదర్శక విధానాలు, అత్యుత్తమ పారిశ్రామిక విధానం పట్ల సంస్థలు ఆసక్తి కనబరిచాయని చెప్పారు. తెలంగాణకు భారీగా పెట్టుబడులను ఆకర్షించి సంస్థల ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ఈ పర్యటన సత్ఫలితాలిచ్చిందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అమెరికాలో పర్యటించి మంగళవారం నాడు తిరిగి హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణకు పెట్టుబడులు వస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి.