చంద్రబాబు, కెసిఆర్ టాప్: గుజరాత్ వెనక్కి
న్యూఢిల్లీ: వ్యాపారం చేసుకోవడానికి అనుకూలతలున్న అత్యంత సులభ రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అగ్ర స్థానానికి ఎగబాకాయి. ఈ విషయంలో ఇప్పటివరకు పేరున్న గుజరాత్ క్రమంగా వెనక్కి వెళ్లింది. సోమవారం ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన సులభ వాణిజ్య విధానం ర్యాంకులు ఈ విషయాన్ని స్పష్టంచేశాయి.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దూరదృష్టి, పరిశ్రమలశాఖ మంత్రి కెటి రామారావు పట్టుదలతో సులభ వాణిజ్య విధానం (ఈవోడీబీ-2016)లో తెలంగాణకు దేశంలోనే నంబర్ వన్ ర్యాంకు లభించిందని మాట వినిపిస్తోంది. 340 రకాల వాణిజ్య సంస్కరణల్లో 324 సంస్కరణలను అమలుచేసి 98.78% స్కోరు సాధించి.. బిజినెస్ లీడర్ హోదా సంపాదించింది.
నిరుడు లీడర్గా ఉన్న గుజరాత్ను తెలంగాణ అధిగమించడం విశేషం. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా ఈవోడీబీలో ఒకటవ ర్యాంకు సాధించింది. మొత్తం 340 రకాల వాణిజ్య సంస్కరణల్లో 324 సంస్కరణలను తెలంగాణ అమలుచేసింది. మిగిలినవాటిలో 12 అంశాలు తెలంగాణ రాష్ట్రానికి వర్తించవు. మరో నాలిగింటిని అమలుచేయలేకపోయింది.
అందువల్ల 100 శాతం స్కోరుకుగాను 98.78 శాతం స్కోరు సాధించింది. టీఎస్ ఐపాస్ అమలుతో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడింది. నిరుడు జూలై మొదలు ఈ సంవత్సరం జూన్ వరకు (2015-16) అమలుచేసిన వాణిజ్య సంస్కరణల ఆధారంగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఢిల్లీలో సోమవారం ఈ ర్యాంకులను ప్రకటించింది.
నిరుడు సంస్కరణల అమలులో 42.45% స్కోరు మాత్రమే సాధించి దేశంలో 13వ స్థానంలో నిలిచిన తెలంగాణ టీఎస్ఐపాస్ రూపకల్పన, అమలుతో తన స్కోరును ఏకంగా 98.78%కి పెంచుకుంది. ఆంధ్రప్రదేశ్ కూడా ఇంతే స్కోరును సాధించి తొలి స్థానంలో నిలిచింది.
రెండవ స్థానం ఏ రాష్ట్రానికి కూడా లభించలేదు. నిరుడు మొదటిస్థానంలో ఉన్న గుజరాత్ ఈసారి మూడో స్థానంలోకి వెళ్లింది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఈ ఏడాది కూడా తమ 4, 5 ర్యాంకుల్లోనే ఉన్నాయి.
తొలి పది ర్యాంకులను సాధించిన రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశానికి చెందినవి తెలంగాణ, ఏపీ మాత్రమే. తొలి పదిహేను స్థానాలను పరిగణనలోకి తీసుకుంటే కర్ణాటకతో కలిపి మూడు దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి. తొలి పది ర్యాంకుల్లో తెలంగాణ, ఉత్తరాఖండ్ మినహా మిగిలినవన్నీ ఎన్డీయే పాలిత రాష్ట్రాలు.
ఏడు ఈశాన్య రాష్ట్రాలు - అసోం, మేఘాలయ, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్, మిజోరం, అరుణాచల్ప్రదేశ్లతో పాటు జమ్ముకాశ్మీర్, ఢిల్లీ మినహా మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాలన్నీ (గోవా, డయ్యు-డామన్, పుదుచ్చేరి, అండమాన్, చండీగఢ్, లక్షద్వీప్, దాద్రానాగర్ హవేలీ) 20వ ర్యాంక్ తర్వాతే ఉన్నాయి. నిరుడు 15వ స్థానం (37.35%)లో ఉన్న ఢిల్లీ ఈసారి 47.62% స్కోరుతో 19వ స్థానంలోకి వెళ్లింది.