అరకు అందాలకు.. అద్దాల రైలు: 19 నుంచి విస్టాడోం సర్వీస్
విస్టాడోం.. ఇది ఒక రైలు బోగీ పేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నుంచి అరకు వరకు గల అందాలను మరింత సుందరంగా చూపేందుకు రూపుదిద్దుకున్న బోగి పేరిది. అరకు అంటేనే దక్షిణాది కాశ్మీర్గా ప్రసిద్ధి.
విశాఖపట్నం: విస్టాడోం.. ఇది ఒక రైలు బోగీ పేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నుంచి అరకు వరకు గల అందాలను మరింత సుందరంగా చూపేందుకు రూపుదిద్దుకున్న బోగి పేరిది. అరకు అంటేనే దక్షిణాది కాశ్మీర్గా ప్రసిద్ధి. అద్దాలతో రూపొందించిన ఈ బోగీ.. 'అరకు అందాలను' పర్యాటక ప్రియులు ముగ్ధ మనోహరంగా వీక్షించేందుకు వీలుగా సర్వాంగసుందరంగా రూపుదిద్దుకుంది.
అద్దాల్లోంచి ప్రకృతి రమణీయతను వీక్షించవచ్చు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారి కల ఆదివారం నెరవేరింది. రైల్వేశాఖ మంత్రి సురేశ్ప్రభు భువనేశ్వర్ నుంచి వీడియో లింక్ ద్వారా రైలును ప్రారంభించారు.
విశాఖపట్నం నుంచి అరకులోయ వరకు రెండు విస్టాడోం కోచ్లను నడపాలని రైల్వేశాఖ గతంలోనే నిర్ణయించింది. విశాఖ- కిరండోల్ పాసింజర్కు ఈ కోచ్లను అమర్చనున్నది.
128 కిలోమీటర్ల దూరం ప్రయాణం
రైల్వే శాఖ ఒక్కో బోగీ తయారీ కోసం సుమారు రూ.3 కోట్లు వెచ్చించింది. వీటిలో ఒకటి శుక్రవారం రాత్రి విశాఖ వచ్చింది. రెండోది మరో 15 రోజుల్లో రానున్నది. ప్రయోగాత్మకంగా రెండు రోజులు నడిపాక ఈ నెల 19 నుంచి కిరండోల్ పాసింజర్కు అనుసంధానం చేస్తారు. అప్పటి నుంచి రోజూ ఉదయం 7.05 గంటలకు విశాఖలో బయలుదేరి 11.05 గంటలకు అరకు చేరుకుంటుంది. 128 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి నాలుగ్గంటల సమయం పడుతుంది. మార్గంమధ్యలో 11 చోట్ల ఆగుతూ 58 టన్నెల్స్ను, 84 వంతెనలను దాటుకుని వెళ్తుంది. అరకులో ఈ బోగీని తొలగిస్తారు. అటు నుంచి సాయంత్రం తిరుగు ప్రయాణంలో వచ్చే కిరండోల్-విశాఖపట్నం పాసింజర్కు అరకులో ఈ కోచ్ను తగిలిస్తారు. ఈ రైలు అక్కడ సాయంత్రం 4.10కి బయల్దేరి రాత్రి 8.50 గంటలకు విశాఖకు చేరుకుంటుంది.
బోగిలో అత్యాధునిక వసతులు
విశాఖ-అరకు మధ్య ఈ విస్టాడోమ్లో ప్రయాణం ఒకింత భారం కానున్నది. ప్రస్తుతానికి టిక్కెట్ ధర నిర్ణయించలేదు. కానీ రూ.500-550 వరకు ఉంటుందని రైల్వే శాఖ వర్గాలు అంటున్నాయి. పూర్తి ఏసీ బోగీ కావడం, అన్ని అత్యాధునిక వసతులు ఉండడం వల్ల ఈ ధర ఉంటుందని చెబుతున్నారు. విశాఖ నుంచి అరకుకు అదే రైలులో టిక్కెట్టు ధర రూ.30లు ఉంది. స్లీపర్కు రూ.150, సెకండ్ ఏసీకి రూ.400 వరకు ఉంది.
రేపటి నుంచే టిక్కెట్ల విక్రయం
ఈ విస్టాడోం కోచ్కు 40 సీట్లు మాత్రమే ఉంటాయి. రెండో కోచ్ వస్తే అదనంగా మరో 40 సీట్లు పెరుగుతాయి. బుధవారం నుంచి రెగ్యులర్గా కిరోండోల్ పాసింజర్ రైలుకు ఈ కోచ్ను అనుసంధానం చేసి నడుపుతారు. ఇందుకోసం మంగళవారం నుంచి టిక్కెట్లను విక్రయిస్తారు.
దేశంలోనే ఇలా తొలిసారి...
దేశంలోనే తొలిసారిగా ఈ తరహా కోచ్లను చెన్నైలో తయారు చేయించింది. అతి విశాలమైన గ్లాసుల కిటికీలు, పైన ఆకాశాన్ని కూడా చూసేలా అద్దాల టాప్ను సుందరంగా రూపొందించారు. బోగీ నుంచి 360 డిగ్రీలు తిరిగేలా కుర్చీలను ఏర్పాటు చేశారు. కోచ్లో జీపీఎస్తో అనుసంధానించిన ఎల్సీడీ ఆడియో, వీడియోలు ఉన్నాయి.