రోశయ్యపై చంద్రబాబు పోరు

జగన్ ను ముఖ్యమంత్రి చేయబోవడం లేదని కాంగ్రెసు అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలు అందడంతో చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేశారు. రాష్ట్రంలో విషజ్వరాల తీవ్రతపై ఆయన తన ఉద్యమాన్ని పోరాటం ప్రారంభించారు. బుధవారంనాడు కరీంనగర్ జిల్లాలో పర్యటించి డెంగ్యూ వ్యాధి పీడితులను పరామర్శించారు. రోశయ్యపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదారాబాదులో తిరగడం మానేసి జిల్లాల్లో పర్యటించాలని ఆయన రోశయ్యను సవాల్ చేశారు. బుధవారం రోశయ్య హైదరాబాదులో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో రోశయ్య హైదరాబాదులో పర్యటించారని చెప్పవచ్చు. దీంతో చంద్రబాబు రోశయ్యపై వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెసు పార్టీ అంతర్గత వ్యవహారాలు కొలిక్కి వచ్చి రోశయ్య మరింతగా బలపడే అవకాశాలు కూడా లేకపోలేదు. దీంతో ముందుగానే రోశయ్యపై విమర్శలు చేయడం ద్వారా స్థిమితం లేకుండా చేయడం చంద్రబాబు ఎత్తుగడగా భావిస్తున్నారు. అంతర్గత కలహాలతో కాంగ్రెసు ప్రభుత్వం పూర్తి కాలం మనుగడ సాగించడం కష్టమని కూడా చంద్రబాబు భావించినట్లు చెబుతారు. అయితే జగన్ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించడం, జగన్ వర్గీయులు ఒక్కరొక్కరే రోశయ్య వైపు మారుతుండడం చంద్రబాబు ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. దీంతో రోశయ్య ప్రభుత్వంపై పోరాటం చేయడం మినహా మరో మార్గం లేదని ఆయన భావించి కార్యరంగంలోకి దిగారని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications