వైయస్ జగన్ ను కాదన్నందుకేనా?
కనీసం కెసిఆర్ తో దీక్ష విరమింపజేసేందుకు అవసరమైన సూచనలు కూడా ఆంధ్ర, రాయలసీమ నేతలు చేయడం లేదు. తనంత తానుగా కెసీర్ దీక్షను విరమించాలని మాత్రమే సూచిస్తున్నారు. కెసిఆర్ దీక్ష చేయడాన్ని కూడా తప్పు పడుతున్నారు. చట్టబద్దమైన పోరాట రూపాల్లో ఆమరణ నిరాహార దీక్ష ఒక్కటనే విషయాన్ని కూడా వారు గుర్తించడం లేదు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయలేదు కాబట్టి సమస్యను పరిష్కరించడానికి తాము సిద్ధంగా లేమనే పద్ధతిలో వారు వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి కె.రోశయ్య తన తెలంగాణ వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తూనే పూర్తిగా పార్టీ అధిష్టానంపై భారం మోపి చేతులెత్తేశారు. హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పాత్రకు అవకాశం లేకుండా తెలంగాణ అంతటా పోలీసులను దింపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ స్థితిలోనే సిద్ధపడిందని చెబుతున్నారు.
కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో తెలంగాణ పార్లమెంటు సభ్యుల సమావేశంలో వైయస్ జగన్ పాల్గొన్నారు. నిజానికి, ఈ సమావేశంలో రాయలసీమ ఎంపీగా ఆయన పాల్గొనడానికి వీలు లేదు. దీన్నే తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ ఎంపీలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయలేని పరిస్థితిని జగన్ కల్పించారని అంటున్నారు. అయినప్పటికీ సర్వే సత్యనారాయణ, హనుమంతరావు వంటి వారు గట్టిగానే మాట్లాడారు. తెలంగాణ ఎంపీలు, మంత్రులు, శాసనసభ్యులు పార్టీ అధిష్టానం వద్ద గట్టిగా మాట్లాడుతున్నా పార్టీ అధిష్టానం కదలడం లేదు. దీన్ని బట్టి తెలంగాణేతర శక్తులు ఎంత బలంగా పని చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు. వైయస్ జగన్ ఒక వైపు రోశయ్య ప్రభుత్వాన్ని కూల్చడానికి, మరో వైపు తెలంగాణ శక్తుల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి సమస్యను జటిలం చేస్తున్నారని అంటున్నారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి దానం నాగేందర్ గ్రేటర్ అంశాన్ని లేవనెత్తడం ఇందులో భాగమేననే అభిప్రాయం వినిపిస్తోంది.
వైయస్ జగన్ పట్టువిడుపుల ధోరణిలో వ్యవహరిస్తే కెసిఆర్ దీక్ష ఉపసంహరణకు పరిష్కారం దొరకవచ్చునని చెబుతున్నారు. రాయలసీమలో ఫాక్షన్ కక్షల్లో ప్రాణాలకు విలువ ఉండదు. మనుషుల ప్రాణాలను తృణప్రాయంగా తీసుకుని హత్యాకాండకు పాల్పడడం కూడా ఉంది. అదే ధోరణి కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష విషయంలో వ్యక్తమవుతోందనే విమర్శ వినిపిస్తోంది. ఈ స్థితిలో తెలంగాణేతర ఎంపీలు ఎదురు తిరిగితే ప్రభుత్వం ప్రమాదంలో పడుతుందనే ఆందోళనలో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏమైనా, కాంగ్రెసు అధిష్టానం ఇప్పుడు అటో ఇటో తేల్చుకోవాల్సిన అనివార్యతలో పడింది.