డైలమాలో రోజా, విజయశాంతి
కాగా, వైయస్ మరణంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలో రోజాతో పాటు విజయశాంతి కూడా పడినట్లు చెబుతున్నారు. తాజా కాంగ్రెసు పరిణామాలు వారికి నిరుత్సాహాన్ని మిగిల్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుత స్థితిలో కాంగ్రెసులో చేరితే భవిష్యత్తు ఏమవుతుందోననే ఆందోళనలో వారున్నట్లు చెబుతున్నారు.
తెలుగు మహిళ అధ్యక్ష పదవికి ఒక ఊపునిచ్చిన రోజా వెళ్లిపోవడంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏం చేయాలో తెలియని స్థితిలో పడ్డారని అంటున్నారు. ఆ పదవిని చేపట్టడానికి శాసనసభ్యురాలు సీతా దయాకర్ రెడ్డి నిరాకరించారు. పైగా, దేవరకద్ర వ్యవసాయాధికారి ఆత్మహత్య కేసులో ఆమె ఇరుక్కున్నారు. దీంతో రోజాను తిరిగి పార్టీలోకి రప్పించేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
విజయశాంతి విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకత్వం కూడా మెతకబడినట్లు చెబుతున్నారు. తిరిగి పార్టీలోకి వస్తానంటే ఆహ్వానించడానికి తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అందుకే ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాను ఏ పార్టీలో ఉన్నానో కూడా తెలియని అయోమయంలో ఆమె పడ్డారు. ఆ విషయం ప్రజలే చెబుతారని ఆమె ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ తో అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమరణదీక్ష చేస్తే మంచిదేనని కూడా ఆమె వ్యాఖ్యానించారు. బహుశా, ఆమె తిరిగి తెరాసకు దగ్గర కావడానికి సిద్ధంగా ఉన్నట్లే కనిపిస్తున్నారు