వైయస్ కు కళ్లెం
చాలా మంది కొత్తవాళ్లకు ఈసారి టికెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి చెబుతూ వచ్చారు. అయితే అందుకు భిన్నంగా కాంగ్రెసు అధిష్ఠానవర్గం వ్యవహరించింది. ఈ స్థితిలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీలో వైయస్ అస్కార్ ఫెర్నాండెజ్ తో వాదానికి దిగినట్లు వార్తలు వచ్చాయి. గెలుపు గుర్రాలను పోటీకి దించాలని తాను తాపత్రయ పడుతుంటే సాదాసీదా అభ్యర్థులను ఎంపిక చేయడం సరి కాదని ఆయన అన్నట్లు చెబుతున్నారు. తన మాట వినకపోతే పార్టీకి కర్ణాటకలో పట్టిన గతే పడుతుందని కూడా వైయస్ అన్నట్లు తెలుస్తోంది.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ పనితీరుపై ఆధారపడే కాంగ్రెసు పార్టీ రాష్ట్రంలో పోటీకి దిగుతోంది. దీని వల్ల పార్టీని విజయం తీరం చేర్చాల్సిన బాధ్యత కూడా వైయస్ మీదనే ఉంది. ఈ స్థితిలో అభ్యర్థుల ఎంపికలో తన మాట నెగ్గకపోతే తానేమీ చేయలేనని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ సిపిఐ, సిపిఎం, తెరాసలతో కలిసి ఎన్నికల సమరంలోకి దిగుతున్న నేపథ్యంలో బలమైన అభ్యర్థులైతేనే విజయం సాధించగలుగుతామనేది వైయస్ ఆలోచనగా చెబుతున్నారు.
కాంగ్రెసు పార్టీకి ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవి. కేంద్రంలో కాంగ్రెసు అధికారాన్ని చేపట్టేది లేనిదీ ఆంధ్రప్రదేశ్ ఫలితాలు మాత్రమే తేల్చే పరిస్థితి ఉంది. అందువల్ల అభ్యర్థుల ఎంపిక కూడా కత్తి మీద సామే అయింది. పార్టీకి విధేయులు, బలవంతులు అయిన అభ్యర్థుల కోసం వైయస్ సర్వేలతో జల్లెడ పట్టారు. అయితే అందుకు విరుద్ధంగా పాతవారినే తిరిగి బరిలోకి దించడానికి కాంగ్రెసు అధిష్ఠానవర్గం నిర్ణయించింది. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.