తెలంగాణపై బాబు గెలుపు?
ఇటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మిగతా పార్టీల కన్నా మించి తెలుగుదేశం తెలంగాణ నాయకులు ముందుకు దూకారు. తొలుత కాస్తా వెనకపడినట్లు అనిపించినప్పటికీ ఆ తర్వాత వారు వేగం పుంజుకున్నారు. సీనియర్ శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెసు తెలంగాణ నాయకులను ఇరకాటంలో పెట్టేందుకు పూనుకుంది. కాంగ్రెసు శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, మంత్రుల రాజీనామాలపై నాగం జనార్దన్ రెడ్డి విరుచుకుపడుతున్నారు. మంత్రులు రాజీనామాలు ఉపసంహరించుకోవడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. శాసనసభ్యులు తమ రాజీనామాల ఆమోదం కోసం స్పీకర్ పై ఒత్తిడి తెచ్చి వాటిని ఆమోదింపజేసుకోవాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు జెఎసిపై తీవ్రమైన ఒత్తిడి పెడుతున్నారు. ఈ స్థితిలో ఒక వైపు ఈ ఒత్తిడి, మరో వైపు రాజీనామాల ఉపసంహరణకు పార్టీ అధిష్టానం ఆదేశాలు కాంగ్రెసు తెలంగాణ నాయకులను తెలుగుదేశం పార్టీ ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది.
రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వాన్ని కూల్చి రాష్ట్రపతి పాలన వచ్చేలా చూడడమే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యూహంగా కనిపిస్తోంది. తద్వారా తిరిగి ఎన్నికలను ఆహ్వానించేలా వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సమైక్య నినాదంతో తెలంగాణను ఖాళీ చేయడం చంద్రబాబుకు కలిసి వచ్చినట్లు భావించవచ్చు. కాంగ్రెసులో రాష్ట్ర విభజనపై ఏకాభిప్రాయం లేకపోవడం, సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు పార్టీ అధిష్టానాన్ని కూడా ధిక్కరించడం చంద్రబాబుకు కలిసి వచ్చిందని చెప్పవచ్చు. కాంగ్రెసు నాయకులు ఒక స్పష్టమైన విధానాన్ని అనుసరించి ఉంటే చంద్రబాబుకు కష్టంగానే ఉండేది. తమపై విమర్శలు వస్తే కాంగ్రెసుపై ఎదురు దాడి చేయడానికి అస్త్రాన్ని అందించినట్లయింది. తెలంగాణ సాధన, సమైక్యాధ్రనో చంద్రబాబు వ్యూహంగా లేదు. కేవలం కాంగ్రెసును దెబ్బ తీయడమే ఆయన లక్ష్యం. కాబట్టి అందులో ఆయన చాలా వరకు విజయం సాధించినట్లే చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ సినిమా ప్రదర్శనను అడ్డుకునే విషయంలో తెలంగాణ ఆందోళనకారులు వెనక్కి తగ్గడం కూడా కొంత మేరకు ఆయన విజయంగానే చెప్పవచ్చు.