సిఎం పదవిపై డిఎస్ కన్ను
తాను శాసనసభకు రావడానికి వీలుగానే ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ పోటీ చేయాలనే వాదనను ఆయన గట్టిగా బలపరిచినట్లు చెబుతున్నారు. పార్టీ అధిష్టానం కూడా ఆయన వాదనకే ఓటు వేసింది. సీమాంధ్ర నాయకుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనే వాదనతో కూడా పార్టీ అధిష్టానం బలపరిచినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి కొన్ని స్థానాలైనా సాధించాలనే పట్టుదలతో డిఎస్ ఉన్నట్లు చెబుతున్నారు. తద్వారా తన సామర్థ్యాన్ని అధిష్టానం వద్ద నిరూపించుకోవాలని ఆయన చూస్తున్నట్లు సమాచారం. తద్వారా పార్టీలో ప్రథమ శ్రేణి నేతగా ముందుకు రావాలనేది ఆయన ప్రయత్నం. బిసి నేతకు భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం వివాదంలో చిక్కుకోవడం ద్వారా భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అవకాశాలు దెబ్బ తినడం డిఎస్ కు మరింతగా కలిసి వస్తుందని అంటున్నారు. అంతేకాకుండా త్వరలో జరిగే పిసిసి అధ్యక్షుడి నియామకంలో కూడా పొన్నాల అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి.
నిజానికి, గతంలోనే తెలంగాణకు చెందిన ఎస్ జైపాల్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని పార్టీ అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. జైపాల్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా పార్టీలోని అన్ని గ్రూపులను అదుపులో పెట్టాలనేది అధిష్టానం వ్యూహంగా కనిపించింది. అయితే అప్పటి సంక్లిష్ట పరిస్థితిలో జైపాల్ రెడ్డి అందుకు అంగీకరించలేదని అంటారు. దానివల్ల రోశయ్యను ముఖ్యమంత్రి పదవి వరించిందని చెబుతారు. శాసనసభలో ఉండి ఉంటే ఆ అవకాశం డిఎస్ కు వచ్చి ఉండేదని అంటారు. ఏమైనా, ఇంకా అందుకు అవకాశం ఉందనే శ్రీనివాస్ భావిస్తున్నారని సమాచారం.