బాబు యాత్ర ఫలించిందా?
11 మంది తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు, ఒక బిజెపి సభ్యుడు రాజీనామా చేయడంతో 12 శాసనసభా స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పార్టీలకు చెందినవారు పాతవారే పోటీ చేస్తుండగా, కొద్దిగా మార్పులు చేర్పులతో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించి పోటీకి దింపాయి. నిజామాబాద్ అర్బన్ లో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ముప్పు తిప్పలు పడుతున్నారు. ఈ రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు ఏ మేరకు ప్రచారం చేస్తున్నారో, గెలిచే అవకాశం ఉందో లేదో తెలియడం లేదు. తెరాస మాత్రం ప్రచారాన్ని కూడా ముమ్మరం చేసింది. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు రోడ్ షోలు నిర్వహిస్తూ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను దుమ్మెత్తి పోస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అభ్యర్థులనైతే పెట్టింది గానీ ప్రచారం చేసుకునే పరిస్థితి లేదు. తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా ప్రచారానికి సిద్ధంగా లేరు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్లే వాతావరణం లేదు. దీంతో ఆయన తెలంగాణ ఎన్నికల్లో పరోక్ష ప్రచారాన్ని ఎంచుకున్నారు. దీంట్లో భాగంగానే ఆయన బాబ్లీ బస్సు యాత్రను చేపట్టారు. బాబ్లీ నిర్మాణం వల్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీళ్లు రావని, దాని వల్ల ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందనేది చంద్రబాబు నాయుడు ప్రధాన ఆరోపణ. ఇందులో నిజం ఉంది. కానీ, చంద్రబాబుకు ఈ బస్సు యాత్ర ఉప ఎన్నికల్లో ఏ మేరకు ఉపయోగపడుతుందనేది అనుమానమే.