జగన్ యాత్ర: చిరుకు హెచ్చరిక
ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తాను తెలంగాణలో పర్యటించి తీరుతానని పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ఆయన ప్రకటనలు చేసినప్పుడల్లా ఎలా తిరుగుతారో చూస్తామని తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల జెఎసి, విద్యార్థి సంఘాల జెఎసి హెచ్చరిస్తూనే ఉన్నాయి. చిరంజీవి తెలంగాణ పర్యటనకు రావడం లేదు. వారికి అడ్డుకునే పని లభించడం లేదు. సమైక్యాంధ్ర నినాదాన్ని బలంగా వినిపిస్తున్న చిరంజీవి తెలంగాణలో పర్యటించడానికి పూనుకుంటే ఏమవుతుందో జగన్ యాత్ర ద్వారా తెలిసి వచ్చిందని అంటున్నారు. వైయస్ జగన్ కు తెలంగాణలో బలమైన అనుచరులున్నారు. తెలంగాణవాదులను తమ బలగంతో ఎదుర్కోగల సత్తా ఉన్నవారు. అయినా, జగన్ యాత్ర ముందు పడలేదు. ఇక చిరంజీవి తెలంగాణలో పర్యటించడం ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సవాల్ చేసినట్లుగా పర్యనటకు వస్తే మరింత దారుణంగా ఉంటుందనేది జగన్ అనుభవం ద్వారా తెలిసి వచ్చినట్లేనని అంటున్నారు. సమైక్యవాదులు ఎవరు వచ్చినా పరిస్థితి ఇలాగే ఉంటుందనేది తెలంగాణవాదులు చెప్పాల్సిన రీతిలోనే చెప్పారని అంటున్నారు.
కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వస్తే కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ ఉండదు. తెలంగాణ కాంగ్రెసు నాయకులే తెలంగాణ ప్రాంతంలో స్వేచ్ఛగా తిరగలేని వాతావరణం ఉంది. సమైక్యాంధ్ర వాదులు తెలంగాణకు వస్తే సజావుగా సాగిపోతుందనుకుంటే భ్రమనే అనే అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష బలాన్ని గుర్తించకుండా ఇప్పటికీ జగన్ మాత్రమే కాకుండా చిరంజీవి, లగడపాటి రాజగోపాల్ ఇతర సీమాంధ్ర నేతలు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, జెఎసి కన్వీనర్ కోదండారమ్ ను తిట్టిపోసినంత మాత్రాన సరిపోదని గుర్తించాల్సి ఉంటుంది.