జస్టిస్ శ్రీకృష్ణ ఎవరు?
తన వృత్తి జీవితాన్ని ఆయన 1967 బొంబాయి హైకోర్టులో ప్రైవేట్ ప్రాక్టీస్ ద్వారా ప్రారంభించారు. హైకోర్టులో కేసులు చేస్తూనే ఆయన సుప్రీంకోర్టులో కూడా కేసులు వాదిస్తూ వచ్చారు. 1987లో సీనియర్ అడ్వొకేట్ అయ్యారు. 1990లో ఆయన బొంబాయి హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 1991లో పర్మినెంట్ జడ్జిగా నియమితులయ్యారు.
బొంబాయిలో 1992 - 93ల్లో తీవ్రమైన మతఘర్షణలు జరిగాయి. హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడిన తర్వాత బొంబాయి అట్టుడికి పోయింది. ఈ ఘర్షణలపై విచారణకు ఏ సీనియర్ న్యాయమూర్తి కూడా ముందుకు రాలేదు. ఈ స్థితిలో జూనియర్ గా ఉన్న శ్రీకృష్ణ విచారణ కమిషన్ కు నేతృత్వం వహించడానికి ముందుకు వచ్చారు. శివసేన వంటి పార్టీల నాయకులకు బెదరకుండా ఆయన తన విచారణ సాగించి, నివేదికను సమర్పించారు. అదే శ్రీకృష్ణ కమిషన్ గా పేరు పొందింది. ఆ తర్వాత నిరుడు ఫిబ్రవరి 19వ తేదీన పోలీసులకు, న్యాయవాదులకు మధ్య హైకోర్టు ఆవరణలో జరిగిన ఘర్షణపై శ్రీకృష్ణ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియామకం జరిగింది. తన మధ్యంతర నివేదికను ఆయన నిరుడు మార్చి 4వ తేదీన సమర్పించారు. రెఫ్యూజీ లా,మానవ హక్కులు ఆయనకు అభిమాన విషయాలు. పారిశ్రామిక వివాదాల అంశంపై ఆయనకు ఎనలేని పట్టు ఉంది.
శ్రీకృష్ణ భార్య పేరు పూర్ణిమ. వారికి సుష్మా, సౌమ్య అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.