జగన్ నుంచి కెసిఆర్ కాపాడుతారా?
వైయస్ జగన్ రోశయ్య ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి పూనుకుంటే ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు ఎంత మంది చిరంజీవి మాట వింటారనేది కూడా అనుమానంగానే ఉంది. శాసనసభ్యుల మాట ఎలా ఉన్న జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు వైయస్ జగన్ వైపు మొగ్గు చూపుతున్నారు. అందు వల్ల ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మరింత పకడ్బందీ పథకాన్ని అనుసరించాల్సిన స్థితిలో కాంగ్రెసు పడిందని అంటున్నారు. అందుకే, కేశవరావు ద్వారా కథ నడిపి కెసిఆర్ మద్దతు సంపాదించడానికి కాంగ్రెసు అధిష్టానం పూనుకుందని అంటున్నారు. అందులో భాగంగానే కేశవరావుకు, కెసిఆర్ కు మధ్య సుదీర్ఘ మంతనాలు జరిగినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో జైపాల్ రెడ్డిని ముఖ్యమంత్రిగా సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ఎగదోస్తున్న సమయంలో దాన్ని అడ్డుకోవడం కెసిఆర్ కు అవసరంగా మారిందని అంటున్నారు. జైపాల్ రెడ్డి ముఖ్యమంత్రిగా వస్తే తెలంగాణ ఉద్యమాన్ని డిసెంబర్ తర్వాత ఉధృతం చేయడం అంత సులభం కాదని, రోశయ్య ముఖ్యమంత్రిగా ఉంటేనే ఉద్యమం తాను అనుకున్న పద్ధతిలో నడుస్తుందని కెసిఆర్ భావించి కేశవరావుతో మాట్లాడినట్లు చెబుతున్నారు. కెసిఆర్ ను దగ్గర చేయడం ద్వారా కాంగ్రెసు వర్కింగ్ కమిటీలో స్థానమో, ముఖ్యమంత్రి పదవో కొట్టేయాలని కేశవరావు భావిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కెసిఆర్ కు స్ఫష్టమైన సంకేతాలు కేశవరావు ద్వారా కాంగ్రెసు అధిష్టానం అందించిందనే ప్రచారం కూడా జరుగుతోంది. తెలంగాణ ఇస్తే తాను పూర్తిగా కాంగ్రెసు వైపు నుంచి ఉంటాననే స్పష్టమైన హామీని కెసిఆర్ నుంచి అధిష్టానం కోరిందా అనేది కూడా ప్రశ్నగానే ఉంది. తెలుగుదేశం పార్టీని బలహీనపరచడమే కాకుండా కాంగ్రెసుకు బలం చేకూరడానికి తమతో కలిసి పనిచేసేందుకు ఒప్పందానికి రావాలని కూడా కెసిఆర్ పై కాంగ్రెసు అధిష్టానం ఒత్తిడి తెచ్చినట్లు భావిస్తున్నారు. అందుకు ముందస్తు హామీ కావాలని కాంగ్రెసు కెసిఆర్ ను కోరినట్లు సమాచారం. ఈ స్థితిలోనే కెసిఆర్ అవసరమైతే కాంగ్రెసు ప్రభుత్వాన్ని కాపాడడానికి, తెలంగాణ ఏర్పాటు తర్వాత కాంగ్రెసు ప్రభుత్వం మాత్రమే ఏర్పడేందుకు కెసిఆర్ హామీ ఇవ్వడంలో భాగంగానే కెసిఆర్, కేశవరావు కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఏమైనా, రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశాలను మాత్రం కాదనలేం.