తెలంగాణపై అయోమయం
ప్రస్తుత స్థితిలో అన్ని పార్టీలు కలిసి జెఎసిగా ఏర్పడి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం నడపడానికి ఉద్యక్తమైనప్పటికీ ఎవరి ఎత్తుగడల్లో వారున్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు పరస్పరం ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెసు పార్టీని ఇరకాటంలో పెట్టడానికి తెలుగుదేశం నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం సృష్టించి రాష్టపతి పాలన వచ్చేలా చూసే దిశలో తెలంగాణ ఉద్యమాన్ని నడపడానికి వారు ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. స్పీకర్ కు ఇచ్చిన రాజీనామాలను అమోదింపజేసుకునేందుకు ఒత్తిడి తేవాలని తెలుగుదేశం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. స్పీకర్ రాజీనామాలు ఆమోదిస్తే రాజ్యాంగ సంక్షోభం వచ్చి తీరుతుంది.
తెలంగాణ ఉద్యమ నాయకత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి కాంగ్రెసు నాయకులు మరో వైపు ప్రయత్నిస్తున్నారు. తమ వల్లనే తెలంగాణ వచ్చిందని ప్రజల చేత అనిపించుకోవడానికి వారు యత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. దామోదర్ రెడ్డి, జానారెడ్డి వంటి నాయకులు తాము పార్టీ అధిష్టానాన్నైనా ఎదిరిస్తామనే దాకా వెళ్తున్నారు. మంత్రులు మాత్రం తమ రాజీనామాలను ఉపసంహరించుకున్నారు. మంత్రులు రాజీనామాలు ఉపసంహరించుకోవడంపై తెలుగుదేశం తీవ్ర విమర్శలు చేస్తోంది.
కాగా, రాజకీయ నాయకులు పైచేయి సాధించకుండా ఉద్యమం తమ చేతుల్లో ఉండేలా ప్రజాసంఘాలు ప్రయత్నిస్తున్నాయి. ఎమ్మార్పీయస్ నేత మంద కృష్ణ మాదిగ వంటి నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు మాత్రం రాజకీయ నాయకులపై తీవ్ర ఒత్తిడి తెచ్చేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. వీరు ఏ మాత్రం పట్టు విడవడానికి సిద్ధంగా లేరు. వీరు పట్టు మీద ఉండడం వల్లనే రాజకీయ నాయకులు తగిన దారిలో ఉన్నారనే అభిప్రాయం కూడా ఉంది.