జగన్ కు వెంకయ్య సపోర్టు
వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ కర్నాటకు చెందిన గాలి జనార్దన్ రెడ్డి, వైయస్ జగన్ వ్యాపార భాగస్వాములు. రాష్ట్రం నుంచి గాలి జనార్దన్ రెడ్డికి ఆదాయం లభించే మార్గాలను దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కల్పించారు. అనంతపురం జిల్లాలో ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమ తవ్వకాలకు వైయస్ పూర్తి సహకారం ఉందని ప్రతిపక్షాలు చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నాయి. అలాగే, గాలి జనార్దన్ రెడ్డికి కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్ ప్రాజెక్టుకు వైయస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు వాడుకోవడానికి అనంతపురం జిల్లా గనులను గాలి జనార్దన్ రెడ్డికి కేటాయించారు. అయితే బ్రాహ్మణి స్టీల్స్ ప్రాజెక్టు నిర్మాణాన్ని కోల్డ్ స్టోరేజీలో పెట్టి అనంతపురం జిల్లా గనుల తవ్వకాల ద్వారా వచ్చిన ముడిసరుకును అమ్ముకోవడం వల్ల గాలి జనార్దన్ రెడ్డి పెద్ద యెత్తున సొమ్ము కూడబెట్టారని అంటున్నారు. ఆ సొమ్ము ద్వారానే ఆయన కర్నాటక రాజకీయాలను శాసిస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఈ స్థితిలో కర్నాటకలో గాలి జనార్దన్ రెడ్డికి ముకుతాడు వేయడానికి కాంగ్రెసు పార్టీ పెద్ద యెత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. గవర్నర్ భరద్వాజ్ ద్వారా గాలి జనార్దన్ రెడ్డిపై చర్యలకు పూనుకుంది.
గాలి జనార్దన్ రెడ్డిపై కాంగ్రెసు దాడిని ఎదుర్కోవడానికి రాష్ట్ర కాంగ్రెసు నాయకత్వం, ప్రభుత్వం వైయస్ జగన్ చేతిలో ఉండాల్సిన అవసరం బిజెపి నాయకత్వానికి ఉంది. జగన్ కు వెంకయ్య నాయుడు పరోక్ష మద్దతు అందించడానికి ఇదే ప్రధాన కారణమని అంటున్నారు. గాలి జనార్దన్ రెడ్డి ద్వారా బిజెపిని రాష్ట్రంలో బలోపేతం చేయడానికి జగన్ నాయకత్వం ఉపయోగపడుతుందని కూడా భావిస్తున్నారు.