వైయస్ జగన్ సలహాదారులు

కాస్తా సీనియర్లు అయిన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, రఘువీరా రెడ్డి ఆయనకు సలహాదారులుగా ఉండవచ్చునని అనుకోవడానికి వీలుంది. అయితే, ఆయన సబితా ఇంద్రారెడ్డి చెప్తే వినే స్థితిలో కూడా లేరని అంటున్నారు. ఏదో మేరకు రఘువీరా రెడ్డి మీద ఆయన ఆధారపడినట్లు చెప్పవచ్చు. ఈ నెల 8వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో తలపెట్టిన ఓదార్పు యాత్రను వాయిదా వేసుకోవడానికి రఘువీరా రెడ్డి మాటలే ఆయన మీద పని చేసినట్లు చెబుతున్నారు. రఘువీరా రెడ్డి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియ శిష్యుడు. రాజశేఖర రెడ్డి రాజకీయాల్లో చురుకైన పాత్ర నిర్వహిస్తున్న కాలంలో రఘువీరా రెడ్డి కాంగ్రెసు అనుబంధ సంస్థ ఎన్ఎస్యూఐలో పనిచేస్తున్నారు. ఓ కార్యక్రమానికి వైయస్ ను రఘువీరా ఆహ్వానించారు. అప్పటి నుంచి వారి మధ్య అనుబంధం పెరిగింది. దానివల్ల ఏదో మేరకు రఘువీరా జగన్ ను కట్టడి చేయడానికి అవకాశం ఉంది.
కానీ, జగన్ వ్యవహరిస్తున్న తీరు పూర్తిగా రఘువీరా మీద ఆధారపడి లేరని చెప్పడానికి వీలు లేకుండా ఉంది. పిసిసి ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు, వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ వంటి నలుగురైదుగురు జగన్ వ్యూహరచనలో పాలు పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, సాక్షి టెలివిజన్ చానెల్ సిఇవో రామ్ అయనకు అత్యంత సన్నిహితుడు. రామ్ కు ఓ యాడ్ ఏజెన్సీ ఉంది. వైయస్ హయాంలోనే ఆ యాడ్ ఏజెన్సీ పెద్ద యెత్తున వ్యాపారం నడిపింది. సాక్షి దినపత్రికను పెట్టిన తర్వాత ఆయన దాంట్లోకి వచ్చారు. రామ్ కు నెమ్మదిగా, ఆచితూచి వ్యవహరించడం నచ్చదంటారు. ఆధునిక ప్రపంచంలో దూకుడుగా, వేగంగా ముందుకు కదలాలని అంటారట. జగన్ కూడా ఒక్కటి మనసులో అనుకుంటే వెనక్కి తగ్గరనే అభిప్రాయం ఉంది. దానివల్ల రామ్ సలహాలు జగన్ చెవికి ఇంపుగా ఉంటాయట. ఆనం సోదరులు కూడా వైయస్ జగన్ కు సన్నిహితంగానే ఉండేవారు. చాలా మంది ఆయనకు అనుచరులుగా ఉన్నారు. వీరందరినీ ఆయన అనుచరులుగానే చూస్తారు తప్ప సలహాదారులుగా చూడరని చెబుతారు. అయితే, అధిష్టానాన్ని ధిక్కరించి జగన్ వెంట వచ్చేందుకు వారు సిద్ధంగా లేరు. అందుకు ప్రధాన కారణం తమ భవిష్యత్తుపై భయం కన్నా జగన్ వ్యవహారం బెడిసికొడుతుందనే భయమే.
జగన్ కు చాలా మంది నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప పార్టీని కాదని ఆయన వెంట నడిచే పరిస్థితి లేదు. ఆయనకు అంతటి నాయకత్వ లక్షణాలు లేవని కూడా చాలా మంది నమ్ముతున్నారు. ఇది జగన్ పెద్ద మైనస్ పాయింట్ అయ్యే ప్రమాదం ఉంది.












Click it and Unblock the Notifications