జగన్ కు ఆ మాత్రం తెలియదా?
వైయస్ జగన్ ను టార్గెట్ చేసుకుంది ముఖ్యంగా పార్టీ అధిష్టానం. అందులోనూ నేరుగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రంగంలోకి దిగారు. రాహుల్ గాంధీ ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. సోనియాను చాలా అరుదుగా, పరోక్షంగా జగన్ టార్గెట్ చేసి మాట్లాడారు. కానీ ముఖ్యమంత్రి రోశయ్య మీదనే ఆయన కామెంట్లు చేశారు. రోశయ్య మీద చేస్తే అధిష్టానం మీద దాడి చేసినట్లేనని ఆయన భావిస్తూ ఉండవచ్చు. ఒక రకంగా, కొద్దిగా సరైన ఎత్తుగడనే కావచ్చు. కానీ సీనియర్ నేతలను, అందునా తెలంగాణ నాయకులను సాక్షి దిన పత్రిక టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం శత్రువుపై యుద్ధంగా చెప్పలేం.
సాక్షి దినపత్రిక ప్రధానంగా ఎంచుకున్నది పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు, కె. కేశవరావులను. వారిద్దరు అధిష్టానానికి చాలా సన్నిహితులు. వారు ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తారా లేదా, వారికి ప్రజల్లో బలం ఉందా లేదా అనేది ఇక్కడ ముఖ్యం కాదు. పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ కూడా సాక్షికి టార్గెట్ గా మారాడని చెప్పవచ్చు. అధిష్టానానికి వారు తప్పుడు సమాచారం ఇచ్చారనేది జగన్ వర్గం ప్రధాన ఆరోపణ. సోనియా, రాహుల్ గాంధీ నేరుగా జగన్ ను కట్టడి చేయడానికి రంగంలోకి దిగారు. లేకుంటే, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ సహకారంతో, కెవిపి రామచందర్ రావు మంత్రాంగంతో జగన్ అనుకున్న లక్ష్యానికి చేరువ అవుతూ వచ్చి ఉండేవారు. ఇది జగన్ వర్గానికి తెలిసినట్లు లేదు. జగన్ కు అంతకన్నా అర్థమైనట్లు లేదు.
అధిష్టానం అనుమతి లేకుండా కేశవరావు, హనుమంతరావు జగన్ పై విమర్శలు చేస్తారని అనుకోవడానికి లేదు. వారు అధిష్టానానికి వీర విధేయులు. అధిష్టానం తాను చెప్పదలుచుకున్న విషయాలను వారి చేత చేయిస్తుందని, తాను చేయాల్సిన యుద్ధాన్ని వారి చేత చేయిస్తుందని జగన్ అర్థం చేసుకుని ఉంటే ఆయన చేసే పోరాటం మరో విధంగా ఉండేది. అలాగే, తెలంగాణ సీనియర్ నేతలు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, అమోస్ ల విషయం కూడా. వారు జగన్ అస్తులపై విరుచుకుపడుతున్నారంటే, అధిష్టానం జగన్ కు హెచ్చరికలు చేస్తుందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా తెలియకుండా జగన్ సమరం చేస్తుండగా, సాక్షి దినపత్రిక వారిని టార్గెట్ చేసుకుని వార్తాకథనాలు ప్రచురిస్తోంది. అధిష్టానం జగన్ పై పోరాటం చేస్తుంటే, జగన్ మాత్రం ప్రత్యర్థులను ఎన్నుకోవడంలోనే విఫలమయ్యారు.