జగన్ హితుల మాట వినడు
నిజానికి, రాష్ట్ర మంత్రుల్లో ఎక్కువ మంది జగన్ హితాన్ని కోరేవారే. కానీ జగన్ రాజకీయాలు ముందుకు సాగవని గుర్తించి క్రమంగా వెనక్కి తగ్గారు. కొంత మంది సీనియర్ మంత్రులు, వైయస్ సన్నిహితులు జగన్ కు సహన మంత్రం బోధించారు. కానీ ఆయన వినలేదు. మెజారిటీ కాంగ్రెసు శాసనసభ్యులు కూడా జగన్ కు అధికారం దక్కాలని కోరుతున్నవారే. కానీ వారంతా ఒక్కరొక్కరే వెనక్కి వెళ్లి జగన్ పక్కన పట్టుమని ఇరవై మంది కూడా మిగలని పరిస్థితి. ఆ ఇరవై మందిలో చాలా మంది అధిష్టానంపై తిరుగుబాటు చేస్తే తాము వెనక్కి తగ్గుతామని చెబుతున్నారు. కాకినాడలో అదే విషయాన్ని వారు జగన్ కు చెప్పారు. అందుకే జగన్ తన ప్రసంగంలో చాలా సహనం వహించి తాను ఎప్పుడు సహనం కోల్పోతానో తెలియదని మాత్రం అన్నారు.
కుటుంబానికి ఇప్పుడు ఆయనే పెద్ద కాబట్టి కుటుంబ సభ్యులకు ఆయన చెప్పడమే తప్ప ఆయనకు చెప్పే వారు లేరు. కుటుంబ సభ్యులంతా ఆయన మాట వినాల్సిందే. ఈ పరిస్థితి రావడానికి కారణం - జగన్ తొందరపాటు, అధికారంపై ఆశ తప్ప మరేమీ కాదు.