జగన్ 'సగం'వాడే
వైయస్ రాజశేఖర రెడ్డి రెండో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన వర్గానికి చెందిన కొందరు సీనియర్లను కూడా దూరం పెట్టారు. పూర్తిగా తనకు భజన చేసే వారికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు. అంతకు ముందు ఏమీ కానివారు కూడా చెలరేగిపోయారు. నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి, కడప జిల్లాకు చెందిన డిఎల్ రవీంద్ర రెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డికి ఒకప్పుడు అత్యంత సన్నిహితులు. అయితే వారిద్దరికి రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత వైయస్ తన మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. ఆ జిల్లా నుంచి జూనియర్లకు అవకాశమిచ్చి వారి ప్రాధాన్యాన్ని తగ్గించారు. ఇటువంటి వారు ఇంకా ఉన్నారు. దీంతో వైయస్ పై అటువంటి వారికి కూడా వ్యతిరేకత ఏర్పడుతూ వచ్చింది. అయితే ఆయన జీవించి ఉన్నంత వరకు ఎవరూ నోరు మెదపలేదు. పార్టీ అధిష్టానం అండదండలు ఉండడం, వైయస్ కు ఎదురు లేకపోవడం అందుకు కారణం. అయితే, వైయస్ చెప్పుల్లో కాళ్లు పెట్టాలని ప్రయత్నిస్తున్న జగన్ కు పెద్ద యెత్తున వ్యతిరేకత ఎదురవుతూ వస్తోంది.
తొలుత ముఖ్యమత్రిగా రోశయ్య అసమర్థుడని చిత్రీకరించడానికి ప్రయత్నించిన జగన్ ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వంపైనే యుద్ధం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తన తండ్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తిలోదకాలు ఇస్తోందంటూ తన ప్రసంగాల ద్వారా, సాక్షి పత్రిక ద్వారా జగన్ విమర్శలు చేస్తూ వస్తున్నారు. దీంతో కాంగ్రెసులోని సీనియర్లంతా మరోసారి ఏకమయ్యారు. ఏకు మేకు కాక ముందే ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కె. రోశయ్య, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఢిల్లీలో మంత్రాంగ నడుపుతున్నారు.