జగన్ పొలిటిక్స్: కొత్త సీన్
ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర కొనసాగుతుండగానే సీన్ మరో మలుపు తిరిగింది. జిల్లా స్థాయిల్లో జగన్ వర్గానికి, వ్యతిరేక వర్గానికి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా జగన్ తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందనే సూచనలు కూడా అందుతున్నాయి. నెల్లూరు జిల్లా ఘటనను ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలోకి జగన్ ఓదార్పు యాత్ర ప్రవేశించక ముందే నెల్లూరులో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. నెల్లూరులో వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహ ప్రతిష్టాపనపై తీవ్ర ఘర్షణ చెలరేగింది. విగ్రహ ప్రతిష్ఠాపనకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. మహానేతగా చెబుతున్న వైయస్ విగ్రహ ప్రతిష్ఠాపనకు ఈ విధమైన వ్యతిరేకత ఎదురు కావడాన్ని బట్టి భవిష్యత్తు రాజకీయాలను ఊహించవచ్చు. వైయస్ రాజశేఖర రెడ్డికి ఇవ్వాల్సినంత గౌరవం మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని, అంతకు మించి ఇవ్వాల్సిన అవసరం లేదని కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు చెప్పవచ్చు. ఇంతకాలం వైయస్ గొప్పతనం గురించి తక్కువగా మాట్లాడని నాయకులు ఇప్పుడు అందుకు కూడా సిద్ధపడేందుకు తయారవుతున్నట్లు భావించవచ్చు.
నెల్లూరులో జగన్ వ్యతిరేకులకు, అనుకూలరకు మధ్య చెలరేగిన వివాదం మిగతా జిల్లాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఓదార్పు యాత్రపై అధిష్టానం వైఖరి స్పష్టం కావడంతో జగన్ ను వ్యతిరేకించే వర్గం ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇంత వరకు మౌనంగా ఉంటూ వస్తున్న ఈ వర్గం పైకి లేచి జూలు విదిలించే అవకాశం ఉంది. దీనివల్ల ప్రతి చోటా ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంటుందనడంలో సందేహం లేదు. ప్రతి జిల్లాలోనూ కాంగ్రెసులో రెండు వర్గాలున్నాయి. ఈ రెండు వర్గాలు మళ్లీ తలెత్తి వివాదాలకు, ఘర్షణలకు కారణం కావచ్చు. ఇదే జరిగితే జగన్ రాజకీయం ఇప్పుటంతా సాఫీగా సాగడం కష్టమే అవుతుంది. మరో వైపు జగన్ వ్యతిరేకులకు అధిష్టానం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాయం అందుతుంది. దానివల్ల జగన్ వ్యతిరేకులది పైచేయి అవుతుంనడంలో సందేహం లేదు. దానివల్ల జగన్ రాజకీయం పూలబాట కాదు, ముళ్లబాట అవుతుంది.