వైయస్ జగన్ సరెండర్
ఇదే సమయంలో జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే లక్ష్యం నుంచి రాజ్యసభ సభ్యుడు, వైయస్సార్ అనుంగు మిత్రుడు కెవిపి రామచందర్ రావు కూడా దూరం జరిగినట్లు చెబుతున్నారు. పార్టీ అధిష్టానం వైయస్ జగన్ ను ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతో లేకపోవడంతో ఆయనకు కూడా ఎదురు దెబ్బ తగిలినట్లు చెబుతున్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి కెవిపి రామచందర్ రావు ఢిల్లీలో లాబీయింగ్ జరిపారు. అయితే, జగన్ ను ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ నుంచి వెనక్కి తగ్గాలని అధిష్టానం ఆయనకు సూచించింది. కెవిపి రామచందర్ రావుకు కేంద్రంలో మంత్రి పదవిని ఇవ్వజూపింది. 2014 ఎన్నికల తర్వాతే జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని పార్టీ అధిష్టానం కెవిపికి సూచించింది. అయితే, దానికి అప్పట్లో కెవిపి అంగీకరించలేదు. మిత్రద్రోహానికి పాల్పడ్డారనే అపవాదును ఎదుర్కోలేక ఆయన మంత్రి పదవిని నిరాకరించారని తెలుస్తోంది.
వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు అధిష్టానం సిద్ధంగా లేకపోవడంతో కెవిపి రామచందర్ రావు ముఖ్యమంత్రి కె. రోశయ్యకు పూర్తిగా సహకారం అందించడానికి ముందుకు వచ్చారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకోవడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. దానికి తోడు, తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో దానికి వ్యతిరేకంగా పనిచేసేందుకు రోశయ్యకు తన చేయూత అందించాల్సిన అవసరం కూడా ఉండడంతో అది తప్పలేదని అంటున్నారు. ఇదే సమయంలో జగన్ కూడా ముఖ్యమంత్రి పదవిపై ఆశలు వదలుకున్నట్లు చెబుతున్నారు. రాయలసీమకు పరిమితమై తన కార్యకలాపాలను కొనసాగించాలని ఆయన నిర్ణయించుకున్నారు.
తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కొంత మంది కాంగ్రెసుకు చెందిన నాయకులు జగన్ ను కలిసి తమ పరిస్థితిని వివరించినట్లు సమాచారం. తమ సంకటస్థితిని వివరించినట్లు చెబుతున్నారు. ప్రజాభిప్రాయం మేరకు నడుచుకోవాలని ఆయన వారికి సూచించినట్లు తెలిసింది. పార్లమెంటులో సమైక్యాంధ్ర నినాదం చేసిన వైయస్ జగన్ ఆ ఉద్యమాన్ని కూడా భుజాన వేసుకుని నడిపించే స్థితిలో లేనట్లు చెబుతున్నారు. మానసికంగా ఆయన రాష్ట్ర విభజనకు సిద్ధపడినట్లు చెబుతున్నారు.