Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్‌పై ఆంధ్రజ్యోతి ప్రశ్నల వర్షం, రామోజీకి సపోర్టు

YS Jagan and Ramoji Rao
ఆంధ్రజ్యోతి సంపాదక పేజిలో కొత్త శీర్షికలో ఇటీవల ఆ పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ వైయస్సాఆర్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెసు, టిడిపి పార్టీలు కలిసి తనపై కుట్ర పన్నుతున్నాయన్న జగన్ ముందు తాను ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. తనపై, తన సంస్థలపై కుట్ర జరుగుతుందన్న వైయస్ జగన్మోహన్ రెడ్డికి తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయనకు వ్యతిరేకంగా రాసిన పత్రికలను వేధించిన విషయం గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ఎత్తిచూపినందుకు తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారన్న ఉద్దేశ్యంతో దివంగత వైయస్ రామోజీరావుకు చెందిన ఈనాడు, ఆంధ్రజ్యోతిని వేధించలేదా అని ప్రశ్నించారు. ఆ కుట్రలో వైయస్ జగన్మోహన్ హస్తం లేదా అని ఆయన ప్రశ్నించారు. తనపై కేసులు పెట్టడానికి ఎక్కడా అవకాశం దొరక్క పోవడంతో ప్రభుత్వ ప్రకటనలలో కోత విధించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్దం అంటూ ఆంధ్రజ్యోతి భవనాన్ని కూలగొట్టడానికి ప్రయత్నాలు చేయలేదా అని ప్రశ్నించారు.

ఆంధ్రజ్యోతి లాగే ఈనాడు పత్రికపై వైయస్ ఉక్కుపాదం మోపాలని అనుకోలేదా, అనుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ చట్టాలలోని చిన్న లోపాన్ని ఆసరాగా చేసుకొని రామోజీ రావు ప్రజల నుండి డబ్బులు సేకరించినప్పటికీ ఏ ఒక్కరికీ ఆతను ఎగవేయలేదన్నారు. అయినప్పటికీ ఈనాడుపై కక్ష సాధించడానికి రామోజీరావుపై కేసుల మీద కేసులు పెట్టి ఆయన కార్యాలయాలలో పోలీసులతో సోదాలు చేయించి పెట్టెల కొద్ది ఫైళ్లు తీసుకు వెళ్లలేదా అని ప్రశ్నించారు. కానీ జగన్ విషయం అలా కాదన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎడాపెడా దోచేశాడని అన్నారు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారన్నారు. ఈ విషయాలపై ప్రశ్నించిన వారిపై కులపరమైన, రాజకీయపరమైన ముద్రలు వేసి ఎదురు దాడికి దిగలేదా అన్నారు. రాష్ట్రాన్ని దండుకున్నందుకు జగన్ బోను ఎక్కాల్సి వస్తున్నందుకు జాలిపడాల్సిన అవసరం లేదని ఆలస్యంగానైనా న్యాయం జరుగుతున్నదని అన్నారు. దేవుడు తనవైపు ఉన్నాడని అంటున్న జగన్ అధికారాన్ని ప్రజల మేలు కోసం ఉపయోగించకుండా, అడ్డగోలు సంపాదనకు ఉపయోగించుకోవచ్చునని ఏ దేవుడు చెప్పారో స్పష్టం చేయాలని అడిగారు. జగన్ నమ్మె జీసస్ కలలో కనిపించి చెప్పారా అని ప్రశ్నించారు.

రాజశేఖర రెడ్డి నిజంగానే మహానేతా లేక కుమారుడి ధన దాహానికి రాష్ట్ర ప్రజల భావి ప్రయోజనాలను తాకట్టు పెట్టారా అనే విషయం ముందు ముందు తేలుతుందని అన్నారు. వైయస్ హయాంలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయన్నారు. కొంతమంది ఐఏఎస్ అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి మామూళ్లు అందే పరిస్థితి వైయస్ హయాంలో ఉందని ఆరోపించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేలకోట్ల రూపాయలు సంపాదించిన జగన్ తాను సిబిఐ విచారణ ఎదుర్కొంటానని ఊహించి ఉండక పోవచ్చునని అందులో అభిప్రాయపడ్డారు. అధికారం శాశ్వతం అని భావించి అహంకారంతో హద్దులు మీరితే కష్టాలు తప్పవని అన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన సమయంలో మరో 25 సంవత్సరాలపాటు అధికారానికి డోకా ఉండదని రాష్ట్రంలో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి ఆపరేషన్ ఆకర్ష్ పథకం ఉందనీ జగన్ తన సన్నిహితులతో అంటూ ఉండేవారని కూడా ఆర్కే చెప్పారు.

జగన్ సిఎం పదవి కోసం అర్రులు చాచకపోతే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. జగన్‌ది దక్కిన దానితో సంతృప్తి చెందే మనస్తత్వం కాదని విమర్శించారు. జగన్ విషయంలో కాంగ్రెసు చాలా ఓపిక పట్టిందన్నారు. సోనియా వంటి బలమైన నాయకురాలిని ఎదురొడ్డటం వల్లనే జగన్ ఇమేజ్ పెరిగిందన్నారు. ఓదార్పు యాత్రను కాంగ్రెసు పట్టించుకోకున్నా ఇంత పాపులారిటీ వచ్చేది కాదన్నారు. మొదట జగన్‌కు మద్దతు పలికిన వారే ఇప్పుడు సోనియాను ఎదిరించడం ఎందుకు? కష్టాలు తెచ్చుకోవడం ఎందుకు? అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారని అన్నారు. జగన్ పట్ల సానుభూతి పెరిగితే రాజకీయాలకు ఆర్థాన్ని పున నిర్వచించవలసి వస్తుందన్న సిపిఐ నారాయణ వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు.

ఓపెన్ హార్ట్స్ విత్ ఆర్కే అని రాధాకృష్ణ ఎబియన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆంధ్రజ్యోతి పత్రికలో అచ్చయిన ఈ వ్యాసం ఆర్కే పేరుతో అచ్చయింది. దాన్ని బట్టి ఆ వ్యాసం రాధాకృష్ణదేనని భావించడానికి వీలవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+