చంద్రబాబుకు సీమాంధ్ర తలనొప్పి
అయితే, సీమాంధ్ర శాసనసభ్యుల తీరు చంద్రబాబుకు సమస్యను తెచ్చే పెట్టే అవకాశాలున్నాయి. తెలంగాణపై తీర్మానం ప్రతిపాదించేందుకు తమకు అవకాశం ఇవ్వాలని సీమాంధ్ర శాసనసభ్యులు చంద్రబాబుపై ఒత్తిడి తేవడానికి నిర్ణయించుకున్నారు. మెజారిటీ శాసనసభ్యులు సీమాంధ్రకు చెందినవారు కావడం వల్ల తీర్మానం సభలో వీగిపోతుందని తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులు భావించి అందుకు ముందుకు వస్తున్నట్లు సమాచారం. అయితే, తాను ఏ విధమైన వైఖరి తీసుకోవాలనేది చంద్రబాబుకు సమస్యగా మారే అవకాశం ఉంది. 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటించారు. దానికి ముందు 7వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో తాము తెలంగాణ తీర్మానాన్ని బలపరుస్తామని తెలుగుదేశం ప్రతినిధులు చెప్పారు. అంతకు ముందు కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలంగాణకు అనుకూలంగా తెలుగుదేశం లేఖ ఇచ్చింది. అంటే, పార్టీ పరంగా తెలుగుదేశం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లే. అయితే, దానికి చంద్రబాబు కట్టుబడి పనిచేయడం లేదు. దానిపై తన పార్టీ నాయకులను, శాసనసభ్యులను, పార్లమెంటు సభ్యులను ఒక తాటి మీద నిలబెట్టలేకపోతున్నారు. అది ఆయనకు ఇష్టం కూడా లేదు. అందుకే, ఇటు తెలంగాణ నాయకులను, అటు సీమాంధ్ర నాయకులను ఆయనే ప్రోత్సహిస్తున్నారు.
శాసనసభలో తెలంగాణ తీర్మానం ప్రవేశపెడితే తాను ఏ విధమైన వైఖరి తీసుకోవాలని చంద్రబాబు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఆయన తన తెలంగాణ అనుకూల వైఖరికే కట్టుబడాల్సి ఉంటుంది. తాను తెలంగాణకు కట్టుబడుతూ సీమాంధ్ర నాయకులను వ్యతిరేకంగా పురికొల్పే అవకాశాలు కూడా లేకపోలేదు. తెలంగాణ తీర్మానంపై ఆత్మప్రబోధం ప్రకారం ఓటు వేయాలని ఆయన తన పార్టీ శాసనసభ్యులకు ఆదేశాలు ఇచ్చే అవకాశాలున్నాయి. దీనివల్ల సీమాంధ్ర నాయకులు వ్యతిరేకంగా, తెలంగాణ నాయకులు అనుకూలంగా ఓటు చేసే అవకాశం కల్పిస్తారని అంటున్నారు. అంటే, పార్టీపరంగా ఒక విధానానికి కట్టుబడాలని విప్ జారీ చేయకపోవచ్చునని అంటున్నారు. కాంగ్రెసు శాసనసభ్యులు కూడా తమ పార్టీ సభ్యుల మాదిరిగానే వ్యవహరిస్తారని సీమాంధ్ర తెలుగుదేశం శాసనసభ్యులు భావిస్తున్నారు. అయితే, పరిస్థితి ఎటు దారి తీస్తుందనేది ఇప్పుడే చెప్పలేం. అసలు సీమాంధ్ర శాసనసభ్యుల ఒత్తిడికి చంద్రబాబు తలొగ్గుతారా అనేది కూడా ప్రశ్నార్థకమే.