రెండు కాంగ్రెసుల పోరు, అశల పల్లకీలో చంద్రబాబు

రాజీనామాల ఆమోదం వల్ల 26 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగితే తమ పార్టీ సత్తా చాటగలదని ఆయన అనుకుంటున్నారు. రెండుకు మించి అదనంగా ఎన్ని సీట్లు వచ్చినా పార్టీ నైతిక బలం చేకూరుతుంది. అయితే, సగానికి పైగా సీట్లలో విజయం సాధించడానికి అవసరమైన వ్యూహాన్ని చంద్రబాబు రూపొదించుకున్నట్లు చెబుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో ఈ 26 స్థానాలలో చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు 2,000 నుంచి 5,000 వోట్ల మధ్య మెజారిటీతోనే గట్టెక్కారు. కొన్ని చోట్ల 1,000 నుంచి 1,500 వోట్ల తేడాతో మాత్రమే విజయాలు సాధించారు. ఈ రెండు మెజారిటీలతో కాంగ్రెస్ సాధించిన స్థానాలు దాదాపు 12కు పైగా ఉన్నాయి.
ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ఆ వోట్లు చీలే అవకాశాలున్నాయని చంద్రబాబు విశ్వసిస్తున్నారు. దాన్ని అవకాశంగా తీసుకుని కాస్తా శ్రమిస్తే చాలా చోట్ల విజయం సాధించవచ్చునని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఆయన ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాలకు చెందిన నాయకులతో ఆయన సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి సుడిగాలి పర్యటన చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. మొత్తంగా, ప్రస్తుత అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications