దోస్తీపై ఇరుకునపడ్డ చిరు
అయితే సున్నిత మనస్కుడు అయిన చిరంజీవిని అల్లు అరవింద్లాంటి వాళ్లు తప్పుదారి పట్టిస్తున్నారని పలువురు ఆరోపణలు గుప్పించారు. అయితే పీఆర్పీ భారీ ఓటమి చెందినప్పటికి చిరుతో ఉంటే రాజకీయంగా భవిష్యత్తు ఉంటుందని, 2014లోనైనా ప్రజారాజ్యానికి మంచి పరిణామాలు ఉంటాయనే ఆశతో చాలామంది చిరు వెంట ఉన్నారు. అయితే తాజాగా కాంగ్రెసు పార్టీతో పొత్తు పెట్టుకున్నా, విలీనం అయినా వారి పరిస్థితి అయోమయంలోకి నెట్టి వేసినట్టే అవుతుందని పలువురు భావిస్తున్నారు. ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు, కాంగ్రెసు, తెదేపాలతో గత సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన వారు 2014పై బాగానే ఆశలు పెట్టుకున్నారు. మరి అధికార కాంగ్రెసు పార్టీతో కలిసిపోతే ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటి అన్నదే ప్రశ్న.
పీఆర్పీ మహిళా విభాగంలో శోభానాగిరెడ్డి ఇప్పటికే జగన్ వెంట వెళ్లినందున సమస్య లేనప్పటికీ ప్రధానంగా ఉన్న వాసిరెడ్డి పద్మ, శోభారాణి పరిస్థితి అగమ్యగోచరం. కృష్ణా జిల్లాలోని పెడన నియోజకవర్గం నుండి గత సాధారణ ఎన్నికలలో వేదవ్యాస్ బరిలో దిగగా కాంగ్రెసు నుండి రమేష్ గెలిచాడు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నుండి మంత్రి తోట నరసింహతో జ్యోతుల నెహ్రూ ఢీ కొట్టి ఓడిపోయారు. ఇలా పీఆర్పీకి పలు నియోజకవర్గాలు గుదిబండగా మారాయి. అయితే అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి జగన్ చెంత చేరడం వల్ల చిరు బావమరిది అల్లు అరవింద్కు, పాలకొల్లు నియోజకవర్గం నుండి చిరంజీవే పోటికి నిలవడం వలన పీఆర్పీకి తలనొప్పులు లేవు.
మొత్తానికి కాంగ్రెసు - పీఆర్పీ కలిస్తే ఇటు కాంగ్రెసు, అటు పీఆర్పీలో ఉన్న ముఖ్యనేతల భవిష్యత్తు ప్రశ్నార్థకమే. అయితే కాంగ్రెసు జాతీయ పార్టీ కాబట్టి సర్దుకుంటుంది. ఇప్పుడు సమస్యంతా రాజకీయాలు తెలియని చిరంజీవికే. చిరంజీవి కాంగ్రెసుతో తన స్వార్థం కోసం కాకపోయినప్పటికీ పీఆర్పీ భవిష్యత్తుకోసమే మొగ్గు చూపిస్తారని అనుకున్నప్పటికీ 125 ఏళ్ల కాంగ్రెసు రాజకీయం చిరంజీవి ఇచ్చిన చేయిని భస్మాసుర హస్తంలా మార్చదని చెప్పలేం. ఈ కారణంగానే పీఆర్పీలో పలువురు కాంగ్రెసుతో విలీనానికి నో చెబుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే పీఆర్పీ భవిష్యత్తు దృష్ట్యా కొంతమంది యస్ చెబుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే తనతో ఉన్న వారికి స్పష్టమైన వచ్చాకే చిరంజీవి కాంగ్రెసుతో విలీనానికైనా, మద్దతుకైనా ఓకే చెబుతారనే వారూ ఉన్నారు.