చిరుతో పొత్తు: తెలంగాణపై ఎఫెక్ట్
అయితే, చిరంజీవితో పొత్తుపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెసు సీనియర్ నేత కెఆర్ ఆమోస్, కాంగ్రెసు వరంగల్ జిల్లా పార్లమెంటు సభ్యుడు బలరాం నాయక్ చిరంజీవితో దోస్తీని ఆహ్వానిస్తున్నారు. హైదరాబాదుకు చెందిన మంత్రి దానం నాగేందర్ కూడా స్వాగతిస్తున్నారు. తెలంగాణకు చిరంజీవితో పొత్తు వ్యతిరేకం కాదని వీరంటున్నారు. ఇప్పటికే కాంగ్రెసు అధిష్టానం తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుందని, శ్రీకృష్ణ కమిటీలోని ఆరవ ప్రత్యామ్నాయాన్ని అమలు చేసే ఆలోచనలో ఉందని వార్తలు వస్తున్నాయి. సమైక్యాంధ్రను కాపాడుతూ, తెలంగాణకు రాజ్యాంగ రక్షణలు కల్పించడమనేది శ్రీకృష్ణ కమిటీలోని ఆరవ ప్రత్యామ్నాయం.
కాగా, చిరంజీవి తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఉంది. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులకు కూడా తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ స్థితిలో చిరంజీవితో పొత్తు వల్ల తెలంగాణలో కాంగ్రెసుకు మరింత వ్యతిరేకత ఎదురవుతుందని భావిస్తున్నారు. చిరంజీవితో పొత్తు లేదా విలీనం ఖరారైన తర్వాత వైయస్ జగన్ వ్యవహారాన్ని ఓ కొలిక్కి తెచ్చి, తెలంగాణ అంశాన్ని తేల్చే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ డిమాండ్పై తలెత్తుతున్న ఉద్యమాలను అణచడానికి తగిన మార్గాలను ఎంచుకోవడం అప్పుడే వీలవుతుందని కాంగ్రెసు అధిష్టానం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏమైనా, తెలంగాణకు వ్యతిరేకంగానే చిరంజీవితో దోస్తీ పనిచేస్తుందనే అభిప్రాయం బలపడుతోంది.