మూకుమ్మడి పోరుకు కాంగ్రెసు వెనుకంజ
ఒకేసారి ఉప ఎన్నికలు జరిగి తమకు వ్యతిరేకంగా ఫలితాలు వస్తే ప్రభుత్వం చిక్కుల్లో పడుతుందనేది కాంగ్రెసు నాయకత్వ భావన. జగన్ వర్గానికి చెందిన 17 మంది శానససభ్యులపై అనర్హత వేటును పెండింగులో పెట్టి ఏడు స్థానాలకు మాత్రమే తొలి విడత ఉప ఎన్నికలు జరిగేలా చూడాలని కాంగ్రెసు ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ఖాళీ అయిన ఏడు శాసనసభా స్థానాలకు ఏప్రిల్ నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంటుంది. ఇందుకు జనవరిలోనే ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలున్నాయని కాంగ్రెసు భావిస్తోంది. ఏడు స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు జగన్ వర్గం శాసనసభ్యులపై అనర్హత వేటును పెండింగులో పెడితే వాటితో వీటికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలుండవు.
అదే సమయంలో ఉప ఎన్నికలు అనివార్యంగా మారుతున్న 24 శాసనసభా నియోజకవర్గాలకు కూడా కాంగ్రెసు ఇంచార్జీలను నియమించే పనిలో పడింది. తొలి విడత ఎన్నికలు జరిగే ఏడు నియోజకవర్గాలకు ఈ నెలాఖరులోగా ఇంచార్జీలను నియమించడానికి కసరత్తు చేస్తోంది. నియోజకవర్గం ఇంచార్జీలనే పార్టీ అభ్యర్థులుగా ఉప ఎన్నికల బరిలోకి దింపుతారు. ఆళ్లగడ్డకు గంగుల ప్రతాపరెడ్డిని, నర్సాపురానికి కొత్తపల్లి సుబ్బారాయుడిని, రామచంద్రాపురానికి తోట త్రిమూర్తులును ఇంచార్జీలుగా నియమించే అవకాశాలున్నాయి. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇందుకు తగిన కసరత్తు చేస్తున్నారు.