తెలంగాణ మంత్రుల ఢిల్లీ పర్యటన వెనుక

ఇటీవల సకల జనుల సమ్మె సమయంలో బాన్సువాడ ఉప ఎన్నికలు జరిగాయి. తెలంగాణ సెంటిమెంట్ ఎంత బలంగా ఉన్నప్పటికీ టిఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుకున్నంత మెజార్టీతో గెలుపొందలేదు. అంతేకాదు కాంగ్రెసు అభ్యర్థికి దాదాపు 34 వేలకు పైగా ఓట్లు పడ్డాయి. కాంగ్రెసు అభ్యర్థికి అన్ని ఓట్లు పడటానికి కారణం సమ్మె సమయంలో టి-ఎంపీలు టిఆర్ఎస్కు ధీటుగా తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొనడమేననేది తెలంగాణ కాంగ్రెసు నేతల వాదన. డిపాజిట్ దక్కడమే కష్టమని టిడిపి, టిఆర్ఎస్తో పాటు కాంగ్రెసు కూడా భావించింది. అందుకే టిడిపి అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు. కానీ ఫలితాలు భిన్నంగా రావడం అందరితో పాటు కాంగ్రెసునూ అబ్బురపరిచింది. వారిలో ఉత్సాహం నింపింది. సమ్మెలో తాము పాల్గొనటం వల్లనే ఆ ఓట్లు వచ్చాయని కాంగ్రెసు ఎంపీలు చెప్పారు.
ఇప్పుడు మంత్రులు కూడా ఉప ఎన్నికల కోసం అదే పంథాలో వెళుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుండే తాము తెలంగాణ కోసం అధిష్టానం వద్ద తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామనే భావన ప్రజల్లో కలిగించి ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశ్యంతోనే ఢిల్లీ పర్యటన వేసినట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీలు ఎలాగూ లోక్సభలో నిరసన తెలిపిన విషయం ప్రజల్లోకి చొచ్చుకు పోయింది. ఇక మంత్రులుగా ఉన్న తాము కూడా అదే బాటలో నడిచి తెలంగాణలో కాంగ్రెసు వీక్ కాకుండా చూసుకోవాలనే భావనతో ఉన్నట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications