చిరంజీవి, దాసరి కలుస్తారా?
అయితే, బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్ష పదవిని చేపట్టిన నేపథ్యంలో చిరంజీవికి, దాసరి నారాయణరావుకు మధ్య సంధి కుదురుతుందా అనే ఆసక్తి చోటు చేసుకుంది. బొత్స సత్యనారాయణ చిరంజీవిని గానీ దాసరి నారాయణ రావును గానీ దూరం చేసుకోవడానికి సిద్దంగా లేరని అంటున్నారు. పిసిసి అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణ నియమితులైన నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందినవారంతా ఏకమై అధికారాన్ని దక్కించుకోవాలనే లక్ష్యం ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో చిరంజీవిని, దాసరి నారాయణరావును కలపడానికి ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది.
పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత బొత్స సత్యనారాయణ చిరంజీవినే కాకుండా, దాసరి నారాయణ రావును కూడా కలిశారు. బొత్స సత్యనారాయణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దాసరి నారాయణ రావు కూడా వచ్చారు. దీన్ని బట్టి చిరంజీవి, దాసరి మధ్య విభేదాలను రూపుమాపే లక్ష్యంతో బొత్స పనిచేస్తారని అంటున్నారు. అయితే, అనూహ్యంగా రామ్ చరణ్ తేజ్ బాంబు పేల్చడంతో పరిస్థితి మొదటికి వచ్చిందని అంటున్నారు. దాసరి నారాయణ రావు హీరోయిన్లపై చేసిన వ్యాఖ్యలను తప్పు పడుతూ రామ్ చరణ్ తేజ్ా బహిరంగంగా మాట్లాడారు. దీంతో తీవ్ర వివాదం చెలరేగింది.
దాసరికి మద్దతు ఇస్తున్న నిర్మాత నట్టికుమార్ రామ్ చరణ్ తేజ్పై తీవ్రంగా మండిపడ్డారు. దాసరి అనుభవమంత కూడా రామ్ చరణ్ తేజ్ వయస్సు లేదని, చిరంజీవిలాంటివారే దాసరిని గురువు అని సంబోధిస్తారని, రామ్ చరణ్ తేజ్ చేసిన సినిమాలు రెండేనని, అందులో ఒకటి హిట్ - మరోటి ఫట్ అని నట్టి కుమార్ అన్నారు. దాంతో రామ్ చరణ్ తేజ్ వివరణ ఇచ్చుకున్నారు. తాను దాసరి అంతటి పెద్దవాడ్ని అనేంతవాడ్ని కానని చెప్పుకున్నారు. అయితే, దీంతో వివాదం సద్దుమణగడం కష్టమేనని అంటున్నారు. కాగా, రామ్ చరణ్ తేజ్ వివాదాన్ని కావాలనే సృష్టించారని కూడా అంటున్నారు. బొత్స సత్యనారాయణకు దగ్గరై కాంగ్రెసులో కీలక పాత్ర పోషిస్తారని అనుమానించి, అందుకు దూరం చేయడానికే దాసరిపై ఆ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. దాసరి నారాయణ రావు కాంగ్రెసులో తిరిగి చురుగ్గా పనిచేసే పరిస్థితి రాకూడదనేది చిరంజీవి అభిమతమని చెబుతున్నారు. ఏమైనా, ఇరువురి మధ్య స్నేహం చిగురించడం అంత సులభం కాదని అంటున్నారు.