డిసెంబర్ 9 ప్రకటన తొందరపాటేనా?

తొందరపాటు వ్యాఖ్యలు చేస్తే జరిగే నష్టం జరగక మానదు కదా! డిసెంబర్ 9 ప్రకటన తొందరపాటులో చేసినదని చేతులు దులుపుకుంటే సరిపోతుందా? దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వం ఇలాంటి తొందరపాటు చర్యలకు పూనుకోవడం ఖచ్చితంగా తప్పే. అయితే తొందరపాటు విషయాలను పక్కన పెడితే ప్రణబ్ చెప్పినట్లు ఆ రోజు చిదంబరం చేసిన ప్రకటన తొందరపాటు చర్యేనా అని పరిశీలిస్తే కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. చిదంబరం డిసెంబర్ 9న ప్రకటన చేయకుముందే నాటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 7వ తారీఖున అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రంలోని అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్నారు. అప్పుడు తెలుగుదేశం, కాంగ్రెసు సహా ప్రధాన పార్టీలన్నీ తెలంగాణకు అనుకూలమని చెప్పారు. శాసనసభలో తీర్మానం ప్రవేశ పెడితే మద్దతిస్తామని ప్రధాన పార్టీలన్నీ చెప్పాయి.
ఆ తర్వాత 9వ తారీఖు ఉదయం అసెంబ్లీలో తెలంగాణ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఆ చర్చలో దాదాపు అన్ని పార్టీలో తెలంగాణకు సుముఖంగా ఉన్నట్లుగా ప్రకటించాయి. ఆ తర్వాత అప్పటి చీప్ విప్ మల్లు భట్టి విక్రమార్క కేంద్రానికి అన్ని పార్టీల అభిప్రాయాన్ని పంపించారు. అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ అనంతరం కేంద్రమంత్రి చిదంబరం డిసెంబర్ 9న దాదాపు ఆర్ధరాత్రి సమయంలో తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇవన్నీ తొందరపాటు చర్యలని భావించినప్పటికీ డిసెంబర్ 10న లోకసభలో ప్రణబ్ ముఖర్జీ, రాజ్యసభలో చిదంబరం తెలంగాణ అంశంపై చర్చ పెట్టారు. దీనికి ప్రధాన ప్రతిపక్షం బిజెపి గట్టిగా మద్దతు పలికింది. బిల్ తెస్తే తాము ఖచ్చితంగా మద్దతు ఇస్తామని చెప్పింది. ఆ తర్వాత పిళ్లై సైతం తెలంగాణకు అనుకూలంగా ప్రకటనలు చేశారు.
రోశయ్య ఆధ్వర్యంలో అఖిలపక్షం ఏర్పాటు చేయడం, అసెంబ్లీలో సుధీర్ఘ చర్చ, అదేరోజు రాత్రి చిదంబరం ప్రకటన, మరునాడు పార్లమెంటులో చర్చ, పిళ్లై స్టేట్మెంట్ ఇవన్నీ తొందరపాటు చర్యలేనా? ఒక్క తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇన్ని తొందరపాటు చర్యలకు పాల్పడటమో, ఒక వ్యక్తి దీక్షకు లొంగి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఆ ప్రభుత్వానికి దేశాన్ని పాలించే అర్హత ఉందని మనం భావించాలా? అంతేకాదు కేంద్ర మంత్రులు ముందు ఓ మాట తర్వాత ఓ మాట, సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ముందు ఓ మాట విలేకరుల సమావేశంలో మరోమాట చెబుతూ పరిస్థితిని మరింత క్లిష్టంగా తయారు చేస్తోన్నట్టుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications